కివీస్ బౌలర్ కు గాయం.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నైకి షాక్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2023 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సీఎస్కేకు సీజన్ ఆరంభానికి ముందే షాకులు తప్పేలా లేవు.

ఐపీఎల్ లో చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ గాయపడ్డాడు. ఇంగ్లాండ్ తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు జెమీసన్ ఎంపికైనా అతడు ఈ సిరీస్ ఆడేది అనుమానంగానే ఉంది. సిరీస్ ప్రారంభానికి ముందే నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్ లో జెమీసన్ గాయం తిరగబెట్టింది.
గతేడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే జెమీసన్.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ రెండు టెస్టులు ఆడిన తర్వాత వెన్నునొప్పితో బాధపడుతూ మిగిలిన టెస్టుకు దూరమయ్యాడు. అప్పట్నుంచీ జెమీసన్ అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టలేదు.
కానీ ఏడు నెలల విరామం తర్వాత దేశవాళీలో ఆక్లాండ్ తరఫున ఆడిన జెమీసన్.. తాజాగా ఇంగ్లాండ్ తో ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ నెల 16 నుంచి ఇంగ్లాండ్.. కివీస్ తో తొలి టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడి గాయం తిరగబెట్టిందని తెలుస్తున్నది. దీంతో అతడిని హుటాహుటిన స్కానింగ్ కోసం క్రిస్ట్చర్చ్ కు తరలించారు.
అక్కడ జెమీసన్ కు వైద్య పరీక్షలు నిర్వహించి తదనంతరం గాయంపై సమీక్షించనున్నారు. అయితే ఇంగ్లాండ్ తో తొలి టెస్టుకు అతడు అందుబాటులో ఉండేది అనుమానమే అని కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు. ఒకవేళ స్కానింగ్ లో అతడికి ఏమీ సమస్య లేదని తేలితే మాత్రం రెండో టెస్టు (ఫిబ్రవరి 24) లో ఆడే అవకాశాలున్నాయని చెప్పాడు.
జెమీసన్ కు గాయమవడం కివీస్ తో పాటు సీఎస్కేకూ ఎదురుదెబ్బే. మరో నెలన్నర రోజుల్లో ఐపీఎల్ - 2023 సీజన్ మొదలుకావాల్సి ఉంది. గతేడాది దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన చెన్నై.. ఈసారి పుంజుకోవాలని భావిస్తున్నది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలూ రచిస్తున్నది. కానీ ఆ జట్టును గాయాలు వేధిస్తుండటం గమనార్హం.
బౌలింగ్ తో పాటు బ్యాట్ తోనూ మెరిసే జెమీసన్ దూరమైతే ఎవరిని ఆడించాలని చెన్నై మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటున్నది. మహీవ్ తీక్షణ, నిషాంత్ సంధు, తుషార్ దేశ్పాండే, మతీశ పతిరానాలలో ఎవర్నో ఒకరిని జెమీసన్ రిప్లేస్మెంట్ గా తీసుకునే అవకాశముంది.