కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు... ఐపీఎల్ 2022 మెగా వేలం ముందు ఫ్రాంఛైజీలకు పెద్ద పరీక్షే...
శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహారించే ఈ టూర్కి భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా వ్యవహారిస్తాడు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహారించబోతున్నాడు. అయితే లంక టూర్కి ప్రకటించిన జట్టు వల్ల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కొత్త సమస్య ఎదురైంది...
శ్రీలంక టూర్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యంగ్ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, కోల్కత్తా నైట్రైడర్స్ ఓపెనర్ నితీశ్ రాణా... అలాగే సీఎస్కే స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్, రాజస్థాన్ రాయల్స్ యంగ్ పేసర్ చేతన్ సకారియా చోటు దక్కించుకున్నారు...
ఐపీఎల్ 2022 సీజన్కి ముందు మెగా వేలం నిర్వహించబోతోంది బీసీసీఐ. మెగా వేలం రూల్ ప్రకారం ప్రతీ జట్టు ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను, ఇద్దరు విదేశీ ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకుని మిగిలిన ప్లేయర్లను వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది...
అన్క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో ఈ రూల్ వర్తించదు. టీమిండియా తరుపున ఎంట్రీ ఇస్తుండడంతో ఈ ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశాన్ని సదరు ఫ్రాంఛైజీలు కోల్పోతాయి.
ఇప్పటికే ఇంగ్లాండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై ఇండియన్స్, వారిని అట్టిపెట్టుకునే అవకాశాన్ని కోల్పోయింది.
ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పెద్ద సమస్య ఎదురుకానుంది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ను ఆర్సీబీ అట్టిపెట్టుకోవడం ఖాయం. వీరితో పాటు స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, పేసర్ కేల్ జెమ్మీసన్లను అట్టిపెట్టుకోవచ్చు.
రెండు సీజన్లుగా అదరగొడుతున్న దేవ్దత్ పడిక్కల్ను అట్టిపెట్టుకోవాలా? లేక వేరే ప్లేయర్ను అట్టిపెట్టుకోవాలా? అనే విషయం గురించి ఆర్సీబీ చాలా ఆలోచనలు చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే చెన్నై సూపర్ కింగ్స్కి కూడా ఈ సమస్య ఎదురుకానుంది. ధోనీ, సురేశ్ రైనా, డుప్లిసిస్, సామ్ కుర్రాన్లను సీఎస్కే అట్టిపెట్టుకోవడం ఖాయం. మరో ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహార్ వంటి ప్లేయర్లతో పోటీపడాల్సి ఉంటుంది...
2021 వేలంలో భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన యంగ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అతనికి కూడా లంక టూర్లో చోటు దక్కడంతో కృష్ణప్ప గౌతమ్ను కూడా అట్టిపెట్టుకోవడానికి లేదు. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసినా ఐపీఎల్ 2021లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు గౌతమ్.
ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కత్తా నైట్రైడర్స్ పర్ఫామెన్స్ ఏ మాత్రం సరిగా లేదు. అయితే కేకేఆర్ తరుపున రాణించిన ఒకే ఒక్క స్వదేశీ బ్యాట్స్మెన్ నితీశ్ రాణా. నాలుగు సీజన్లుగా ఐపీఎల్లో అదరగొడుతున్న నిలకడలేమి సమస్య కారణంగా రాణాకి టీమిండియా నుంచి పిలుపు రాలేదు...
ఎట్టకేలకు అతనికి లంక టూర్లో చోటు కల్పించారు సెలక్టర్లు. దీంతో కోల్కత్తా నైట్రైడర్స్ దినేశ్ కార్తీక్, శుబ్మన్ గిల్, నితీశ్ రాణా వంటి ప్లేయర్లలో ఎవరు ఉంచుకోవాలి? ఎవరిని వదులుకోవాలనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది...
ఆరంగ్రేటం సీజన్లో అదరగొట్టి, నేరుగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు చేతన్ సకారియా. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పర్ఫామెన్స్ ఆధారంగా టీమిండియాలోకి దూసుకొచ్చిన ఈ యంగ్ గన్ను అట్టిపెట్టుకోవాలంటే రాజస్థాన్ రాయల్స్, స్టార్లను పక్కనబెట్టాల్సి ఉంటుంది...
ఐపీఎల్ 2021 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్న హర్షల్ పటేల్కి మాత్రం లంక టూర్లో అవకాశం దక్కలేదు. దీనికి సీఎస్కే, పంజాబ్ కింగ్స్లతో జరిగిన మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లో అతను భారీగా పరుగులు సమర్పించడమే. కీలక సమయంలో రన్స్ ఇస్తుండడంతో 30 ఏళ్ల సీనియర్ హర్షల్ పటేల్కి లంక టూర్కి సెలక్ట్ చేయలేదు సెలక్టర్లు.