ఆ రోజు గదిలోకి వెళ్లి ఏడ్చేశా, చెత్త ఆటగాడిని కాదు... టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానంటున్న పృథ్వీషా...
టీమిండియాలోకి ఓ సంచలనం దూసుకొచ్చాడు యంగ్ బ్యాట్స్మెన్ పృథ్వీషా. ఆరంగ్రేటం మ్యాచ్లో భారీ శతకంతో అదరగొట్టిన పృథ్వీషా... గత ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన ఒక్క మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
ఆసీస్ టూర్లో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ ఘోరంగా ఫెయిల్ అయిన పృథ్వీషా... ఆడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు...
పింక్ బాల్ టెస్టులో డిజాస్టర్ పరాజయం తర్వాత రెండు ఇన్నింగ్స్ల్లోనూ క్లీన్బౌల్డ్ అయిన పృథ్వీషాని పక్కనబెట్టేసింది టీమిండియా. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లోనూ అతనికి అవకాశం దక్కలేదు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి కూడా ఎంపిక కాలేదు పృథ్వీషా...
అయితే విజయ్ హాజారే ట్రోఫీ 2021లో సంచలన ప్రదర్శన ఇస్తున్నాడు ముంబై సారథి పృథ్వీషా... ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసి, టోర్నీ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు...
‘ఆడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో బాగా నిరుత్సాహపడ్డాను. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అవుటై పోయాను... నా బ్యాటింగ్లో లోపాలను సరిదిద్దుకోవాలని అనుకున్నా...
డే నైట్ టెస్టులో ప్రపంచంలో ది బెస్టు టీమ్ అయిన ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ఇబ్బందిపడతాను. నాపైన ట్రోలింగ్ చూసి షాక్ అయ్యాను... అద్దం ముందు నిల్చిని... ఎందుకు అవుట్ అయ్యానా? అని చాలాసార్లు ప్రశ్నించుకున్నా...
నేను అందరూ అనుకునేంత చెత్త ఆటగాడిని కాదు... టీమ్లో నుంచి నన్ను పక్కకి తప్పించారని తెలిసిన రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నా... నేను వీధిలో పెరిగిన కుర్రాడిని. పోయినచేటే వెతుక్కోవడం బాగా తెలుసు...
అందుకే విజయ్ హాజారే ట్రోఫీలో రాణించాలని కసిగా అనుకున్నాను. ఇప్పటివరకూ నా ప్రదర్శనతో సంతృప్తి చెందాను... త్వరలోనే టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాను...’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీషా...
విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా మయాంక్ అగర్వాల్ రికార్డు బ్రేక్ చేసిన పృథ్వీషా... పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 227 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదిన బ్యాట్స్మెన్గా సంజూ శాంసన్ రికార్డును బ్రేక్ చేశాడు...
ఆదివారం ఉత్తరప్రదేశ్, ముంబై జట్ల మధ్య విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో కూడా పృథ్వీషా రాణిస్తే... ఇంగ్లాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు అతనికి పిలుపు వచ్చే అవకాశం కచ్ఛితంగా ఉంటుంది.