లంక టూర్లో ఈ ప్లేయర్ ఎలా రాణిస్తాడో చూడాలని ఉంది... - బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎమ్మెస్ ప్రసాద్...
ఓ వైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్కి వెళ్లగా... వచ్చే నెలలో వైట్ బాల్ స్పెషలిస్టులతో మరో టీమ్ లంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. లంక టూర్లో సూర్యకుమార్ యాదవ్ ఎలా రాణిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
నాలుగు సీజన్లుగా ఐపీఎల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్ ద్వారా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే...
అంతర్జాతీయ కెరీర్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, ఆ మ్యాచ్లో అదిరిపోయే హాఫ్ సెంచరీ బాదాడు. బీసీసీఐ సెలక్టర్ల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా 30 ఏళ్ల వయసులో లేటుగా క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాడు.
‘శ్రీలంక టూర్లో సూర్యకుమార్ యాదవ్ కీ ప్లేయర్గా మారతాడని ఆశిస్తున్నా. ఈ టూర్లో భారత యంగ్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లకు కూడా అవకాశం రావచ్చు. సీనియర్లు లేని టైంలో జరిగే ఈ టూర్ వారికి ఓ సువర్ణ అవకాశం లాంటిది...
ఐపీఎల్లో ఆవేశ్ ఖాన్ అదరగొట్టాడు. అతను కూడా ఎలా రాణిస్తాడో చూడాలని ఎదురుచూస్తున్నా. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన ఆవేశ్ ఖాన్, లంక టూర్లో ఎంట్రీ ఇచ్చే మంచి అవకాశాన్ని కోల్పోయాడు...
ఐపీఎల్ కారణంగా భారత జట్టు తరుపున ఎంట్రీ ఇస్తున్న కుర్రాళ్లు, ఏ మాత్రం భయపడడం లేదు. మొదటి మ్యాచ్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా రాణిస్తున్నారు. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ రాకపోయినా, రెండో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులు చేసి అదరగొట్టాడు.
యాదవ్ మాత్రమే కాదు, ఇషాన్ కిషన్ కూడా మొదటి మ్యాచ్లోనే అద్భుతంగా రాణించాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని కరెక్టుగా ఎలా వాడుకోవాలో నేటి కుర్రాళ్లకు బాగా తెలుసు...
ఇంతకుముందుతో పోలిస్తే ఆటగాళ్ల సామర్థ్యంలో ఎలాంటి మార్పు లేదు. దశాబ్దం కిందట భారత జట్టులోకి వచ్చే ప్లేయర్లు కూడా చాలా సామర్థ్యంతో టీమ్లో ప్లేస్ దక్కించుకునేవాళ్లు. అయితే అప్పుడు వారిలో ఒత్తిడి ఉండేది.
ఇప్పుడు ఐపీఎల్ కారణంగా యువ క్రికెటర్లలో నమ్మకం పెరుగుతోంది. విదేశీ క్రికెటర్లు, స్టార్ ప్లేయర్లతో ఆడడం వల్ల అంతర్జాతీయ మ్యాచ్ను కూడా ఐపీఎల్ మ్యాచ్లాగే ఆడేస్తున్నారు..
దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న మొదటి బాల్కి సిక్సర్ కొట్టడమే. ఇంగ్లాండ్తో ఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు సూర్యకుమార్ యాదవ్... లంక టూర్లో కుర్రాళ్లు అదరగొడతారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్.
వైట్ బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్లు అయిన శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నవ్దీప్ సైనీ, నటరాజన్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్లకు లంక టూర్లో చోటు దక్కొచ్చు.
జూలై 13 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో భారత జట్టు మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ టూర్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులో ఎంపిక చేయనున్నారు బీసీసీఐ సెలక్టర్లు.