ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో నా బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది... - ఆల్రౌండర్ రవీంద్ర జడేజా...
టీమిండియాలో ఇప్పుడున్న ప్లేయర్లలో రవీంద్ర జడేజా కీ ప్లేయర్. అటు బ్యాటుతో, ఇటు బాల్తో పాటు ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తాడు జడ్డూ. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో పూర్తిగా రవీంద్ర జడేజా షో నడిచింది.
సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో ఐదు సిక్సర్లు, ఓ ఫోర్తో 37 పరుగులు రాబట్టిన రవీంద్ర జడేజా, బౌలింగ్లో మూడు వికెట్లు, ఓ రనౌట్, ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకుని అదరగొట్టాడు.
రెండేళ్లుగా భారత్కి మ్యాచ్ విన్నర్గా మారిన జడ్డూ... తన బ్యాటింగ్ ఇంతలా మారడానికి భారత మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన సలహాయే కారణమని అంటున్నాడు.
‘2015కి ముందు నేను బ్యాటింగ్పై పెద్దగా ఫోకస్ పెట్టేవాడిని కాదు. అయితే నాలో మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడని నాకు తెలుసు. 2015 వన్డే వరల్డ్కప్ సమయంలో ధోనీ నాకు చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి.
ఓ మ్యాచ్ పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చిన ధోనీ... ‘నువ్వు ఏ బంతులు వదిలేయాలో వాటినే ఆడేందుకు ప్రయత్నిస్తూ అవుట్ అవుతున్నాం. ఏ బంతులను ఆడాలో వాటిని వదిలేస్తున్నాం...’ అని చెప్పాడు.
నా షాట్ సెలక్షన్ తప్పుగా ఉందని మాహీ చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమైంది. నిజమే అంతకుముందు ఏ బంతిని షాట్ ఆడాలనే దానిపై నాకు క్లారిటీ ఉండేది. బంతిని ఆడే ఆఖరి సెకన్ దాకా డబుల్ మైండ్సెట్తో ఉండేవాడిని....
ఆడాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి చాలా సమయం తీసుకునేవాడిని. అందుకే బ్యాటింగ్లో సరిగ్గా రాణించలేకపోయా. అయితే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. టైమింగ్ అందుకోవడం తెలుసుకున్నా.
ఏ బాల్కి షాట్ ఆడాలో, ఏది వదిలేయాలో తెలుసుకున్నా. ధోనీ చెప్పినట్టుగా నిలదొక్కుకుంటే ఎలాంటి పిచ్లో అయినా పరుగులు రాబట్టవచ్చని తెలుసుకున్నా... ఇప్పుడు షార్ట్ పిచ్ బంతులను కూడా బౌండరీ దాటించగలను...’ అంటూ చెప్పుకొచ్చాడు రవీంద్ర జడేజా.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అదరగొట్టిన రవీంద్ర జడేజా, ఆ మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మొదటి టీ20 మ్యాచ్లో మంచి హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడ్డూ హెల్మెట్కి బాల్ తగిలింది. అయినా బ్యాటింగ్ కొనసాగించిన జడేజా, ఫీల్డింగ్కి రాలేదు.
కంకూషన్ సబ్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్, ఆ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ తర్వాత మెల్బోర్న్ టెస్టులో మళ్లీ జట్టులోకి వచ్చాడు రవీంద్ర జడేజా. సారథి అజింకా రహానేతో మంచి భాగస్వామ్యం నెలకొల్పి హాఫ్ సెంచరీ బాదాడు.
సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్లో కూడా విరిగిన వేలుతోనే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే హనుమ విహారి, అశ్విన్ చారిత్రక భాగస్వామ్యం వల్ల జడ్డూకి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.
చేతి వేలికి శస్త్ర చికిత్స తర్వాత మళ్లీ ఐపీఎల్ 2021 సీజన్లో బరిలో దిగిన రవీంద్ర జడేజా... మొదటి సగంలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో జడ్డూ పర్ఫామెన్స్పై భారీ అంచనాలే ఉన్నాయి.