టీమిండియా కొత్త జెర్సీ కథ ఇదే.. ఆ మూడు స్టార్ల మీదే అందరి చూపు..
Team India New Jersey: రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. టీమిండియా జెర్సీ పార్ట్నర్ గా ఉన్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ఇటీవలే ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది.
భారత క్రికెటర్ల జెర్సీ మారింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ, టీమిండియా జెర్సీ పార్ట్నర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ఇటీవలే కొత్త జెర్సీని విడుదల చేశాయి. అయితే మరి ఈ జెర్సీలో కనిపిస్తున్న ట్రయాంగిల్స్, స్టార్స్ కు అర్థమేమిటి..?
లైట్ స్కై బ్లూ కలర్ లో ఉన్న ఈ జెర్సీలను తయారుచేయడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలకు సంబంధించి ఎంపీఎల్ స్పోర్ట్స్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవిగో..
కొత్త జెర్సీలో షేడింగ్ అవుతూ త్రిభుజాకారంలో కనిపిస్తున్నవి ట్రయాంగిల్స్.. ఇవి టీమిండియా ఫ్యాన్స్ శక్తి (ఎనర్జీ), స్ఫూర్తి (స్పిరిట్), సామర్థ్యం (పవర్) లను సూచిస్తాయి.
ఇక జెర్సీ ఎడమవైపుగా షేడింగ్ లేకుండా బ్లూ కలర్ లో.. పూరేకుల ఆకారంలో ఉన్నవి పెటల్స్. వీటిని బీసీసీఐ లోగో నుంచి తీసుకున్నారు. ఇది మెరిట్, లొయాలిటీని సూచిస్తున్నది.
అన్నింటికంటే ముఖ్యమైనది బీసీసీఐ లోగో మీద ఉన్న మూడు స్టార్లు.. లోగో మీద ఉన్న ఈ స్టార్లు దేనికి సంకేతమని క్రికెట్ వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతున్నది. తాజాగా ఎంపీఎల్ ఆ చర్చలకు సమాధానం చెప్పింది. లోగో మీద ఉన్న మూడు నక్షత్రాలు.. భారత్ గెలిచిన మూడు ప్రపంచకప్పులు.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు మొదటి ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా.. తొలి టీ20 ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. 2011లో ధోని నాయకత్వంలోనే భారత జట్టు రెండో వన్డే ప్రపంచకప్ ను నెగ్గింది.