IND vs ENG: టీమిండియాకు గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇచ్చిన సిరాజ్
IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టుకు ముందు మహమ్మద్ సిరాజ్ కీలక అప్డేట్ ఇచ్చారు. మాంచెస్టర్ లో జరిగే టెస్టులో గెలిచి భారత్ సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.

భారత్ - ఇంగ్లాండ్ 4వ టెస్టుకు ముందు సిరాజ్ కీలక వ్యాఖ్యలు
భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్, ఇంగ్లాండ్తో జరుగనున్న కీలక నాలుగో టెస్టుకు ముందు గుడ్ న్యూస్ చెప్పారు. మాంచెస్టర్ లో జరిగే టెస్టుకు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారని తెలిపారు.
అయితే ఆకాష్ దీప్ ఫిట్నెస్ ఇంకా పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. ఆల్ ట్రాఫోర్డ్లో బుధవారం ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్కు ముందు మీడియాతో సిరాజ్ మాట్లాడుతూ.. "జస్సీ ఖెలేంగే" (బుమ్రా ఆడతారు) అని చెప్పారు.
🗣️🗣️ I like to give my hundred percent when I represent the nation
Here's some Monday Motivation from Mohd. Siraj ahead of the 4th #ENGvIND Test in Manchester 🙌#TeamIndia | @mdsirajofficialpic.twitter.com/zJTLoR99pU— BCCI (@BCCI) July 21, 2025
భారత్ 1-2తో ఇంగ్లాండ్ ఆధిక్యం.. 4వ టెస్టు టీమిండియాకు కీలకం
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఇప్పటికే 1-2తో వెనుకబడింది. మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. గెలుపు దగ్గరగా వచ్చి తడబడింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు భారత జట్టుకు కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
జస్ప్రీత్ బుమ్రా ఫిట్, ఆకాష్ దీప్ ఆడతారా?
బుమ్రా మొదటి టెస్టులో ఆడి రెండవ టెస్టుకు విశ్రాంతి తీసుకున్నారు. మూడవ టెస్టులో మళ్లీ బుమ్రా బరిలోకి దిగారు. ఇప్పటివరకు రెండు టెస్టుల్లో 12 వికెట్లు తీసిన బుమ్రా, భారత్కు వికెట్లు అందించడంలో కీలకంగా మారాడు.
ఇక అకాష్ దీప్ తొలి టెస్టుకు దూరంగా ఉండగా, రెండవ, మూడవ టెస్టుల్లో ఆడారు. కానీ గ్లోయిన్ సమస్యతో అతని ఫిట్నెస్పై అనిశ్చితి నెలకొంది. "ఆకాష్ దీప్కి గ్లోయిన్ సమస్య ఉంది. ఆయన ఈరోజు బౌలింగ్ చేశారు. ఇప్పుడు ఫిజియోస్ చూస్తున్నారు" అని సిరాజ్ తెలిపారు.
బౌలింగ్ లో అదరగొడుతూనే బ్యాటింగ్ లో పోరాటం చేస్తున్న సిరాజ్
ఈ సిరీస్ మూడు టెస్టుల్లో 13 వికెట్లతో భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్గా సిరాజ్ కొనసాగుతున్నాడు. తాను అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. "ఇది నా దేశం కోసం ఆడుతున్న సందర్భం. దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు. నాకు ఒకే లక్ష్యం ఉంది.. ప్రతీ మ్యాచ్లో 100 శాతం ఇవ్వడం" అని సిరాజ్ పేర్కొన్నాడు.
మూడవ టెస్టులో బ్యాటుతో కూడా సిరాజ్ భారత జట్టు గెలుపు కోసం పోరాడాడు. వరుసగా వికెట్లు పడ్డ సమయంలో 29 బంతులు ఎదుర్కొని చివరికి షోయబ్ బషీర్ బౌలింగ్లో అనూహ్యంగా గ్రౌండ్ పై బాల్ పడి వికెట్లు తాకడంతో అవుటయ్యాడు.
జడేజాతో భాగస్వామ్యంపై సిరాజ్ భావోద్వేగం
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడవ టెస్టులో రెండు 10 ఓవర్ల స్పెల్స్ వేయడాన్ని సిరాజ్ ప్రశంసించారు. జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. "అది మనం గెలిచే మ్యాచ్ గా ఉంది. అయితే, 22 పరుగుల తేడాతో ఓడిపోవడం చాలా బాధను కలిగించింది" అని చెప్పారు.
కాగా, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్ గాయాల కారణంగా టెస్టు సిరీస్ నుంచి అవుట్ అయ్యారు. తర్వాతి రెండు టెస్టులకు అన్షుల్ కాంబోజ్ను పేస్ రిజర్వ్లోకి తీసుకున్నారు. వికెట్కీపర్ రిషభ్ పంత్ లార్డ్స్ టెస్టులో చేతికి గాయం కావడంతో, నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటారా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.