గల్లీ క్రికెట్ ఆడేటోన్ని అంతర్జాతీయ మ్యాచ్లో ఆడించారు.. అందుకే పాక్కు ఈ గతి.. మాజీ స్పిన్నర్ కామెంట్స్
పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. వరుసగా రెండు టెస్టులలో గెలిచి సిరీస్ ను చేజిక్కించుకుంది. రెండు టెస్టులలోనూ గెలపునకు దగ్గరగా వచ్చినా పాక్ విజయం ముంగిట బోల్తా కొట్టింది.
రావల్పిండితో పాటు ముల్తాన్ వేదికగా ముగిసిన రెండు టెస్టులలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ మాజీ క్రికెటర్లు జట్టు ప్రదర్శనపై దుమ్మెత్తి పోస్తున్నారు. బ్యాటింగ్ పిచ్ లు, స్పిన్ కు అనుకూలించే పిచ్ లు తయారు చేయించుకుని కూడా ఎందుకు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముల్తాన్ లో పాక్ ఓటమిపై మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ కు కూడా పనికిరానోళ్లను తీసుకొచ్చి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయని వాపోయాడు. పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అలీ పై విమర్శలు గుప్పించాడు.
ముల్తాన్ టెస్టు ముగిసిన తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మహ్మద్ అలీని ఆడించింది. అసలు అతడు టెస్టు బౌలరే కాదు. మీరు (పీసీబీ) మరో బౌలర్ ను ప్రయత్నిస్తే బాగుండేది. అలీకి టెస్టు క్రికెట్ ఆడే సత్తా లేదు. ఏదో దేశవాళీ క్రికెట్ లో నెగ్గుకొస్తున్నాడు తప్ప అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే సత్తా అతడికి లేదు.
రెండో టెస్టులో నసీమ్ షాను ఎందుకు పక్కనబెట్టారు.? మహ్మద్ అలీ బౌలింగ్ చేయడు. బ్యాటింగ్ రాదు. ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏం ఉండదు. అతడో చెత్త ఆటగాడు. పాకిస్తాన్ జట్టు నుంచి అత్యంత దారుణ ప్రదర్శన ఇది.. ఇలాంటోళ్లను ఆడిస్తే పాకిస్తాన్ కు ఇటువంటి ఫలితాలే వస్తాయి...’ అని అన్నాడు.
పాక్ సీనియర్ పేసర్లు షాహీన్ షా అఫ్రిదికి గాయం కారణంగా ఈ సిరీస్ లో అందుబాటులో లేడు. హరీస్ రౌఫ్, నసీమ్ షా తొలి టెస్టులో ఆడినా అంత గొప్ప ప్రదర్శనలేమీ చేయలేదు. తొలి టెస్టులో గాయమైందనే సాకుతో రెండో టెస్టులో నసీమ్ షాను ఆడించలేదు. గాయం కారణంగా రౌఫ్ కూడా ముల్తాన్ టెస్టుకు దూరమయ్యాడు. దీంతో మహ్మద్ అలీని కొనసాగించక తప్పనిపరిస్థితి.
సీనియర్ల గైర్హాజరీలో మహ్మద్ అలీ రెండు టెస్టులు ఆడాడు. రావల్పిండిలో తొలి, రెండో ఇన్నింగ్స్ లో తలా రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు అలీని ఆటాడుకున్నారు. ఇక ముల్తాన్ టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.