సన్రైజర్స్కి షాక్... బయో బబుల్ భయంతో ఐపీఎల్కి స్టార్ ప్లేయర్ దూరం...
ఐపీఎల్ 2021 సీజన్ ఇంకా ఆరంభం కాకముందే సన్రైజర్స్ హైదరాబాద్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, బయో బబుల్ భయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లోనూ మొదటి మ్యాచ్లోనే గాయపడి, ఐపీఎల్ 2020 మొత్తానికి దూరమయ్యాడు మార్ష్...
రెండు నెలల పాటు బయటి ప్రపంచానికి దూరంగా, బుడగ నీడలో బతకడం ఇష్టం లేదని చెప్పిన మిచెల్ మార్ష్, ఐపీఎల్ ఆడడం లేదని స్పష్టం చేశాడు.
మిచెల్ మార్ష్ స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జాసన్ రాయ్ను ఎంపిక చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇండియా టూర్ ముగించుకున్న జాసన్ రాయ్, నేరుగా సన్రైజర్స్ జట్టుతో కలవనున్నాడు.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్లో వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియంసన్... ఇలా విదేశీ బ్యాట్స్మెన్లు ఉన్నారు. వీరు గాయపడితేనే రాయ్కి తుది జట్టులో ఆడే అవకాశం దొరుకుతుంది.
గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రత్యర్థి జట్ల కంటే గాయాలే ఎక్కువగా బాధపెట్టాయి. ఏకంగా నలుగురు స్టార్లు గాయాలతో ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలోనే తప్పుకున్నారు
ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంలో భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్, కేన్ విలియంసన్ గాయాలతో బాధపడ్డారు. డేవిడ్ వార్నర్ కూడా గాయపడి కోలుకున్నాడు...
మిచెల్ మార్ష్ను ఐపీఎల్ 2020 వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇదే మొతాన్ని జాసన్ రాయ్కి కూడా చెల్లించనున్నారు...
ఐపీఎల్ 2021 సీజన్లో ఏ జట్టుకూ సెలక్ట్ కాని జాసన్ రాయ్, అమ్ముడుపోనందుకు సిగ్గుపడుతున్నానంటూ ట్వీట్ వేశాడు... అయితే అదృష్టవశాత్తు మళ్లీ ఐపీఎల్ ఆడబోతున్నాడు రాయ్...
గత సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన మిచెల్ మార్ష్... ఒకే ఓవర్ బౌలింగ్ చేసి సిక్సర్ను ఆపే క్రమంలో గాయపడ్డాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్లో 21 మ్యాచులు ఆడి 20 వికెట్లు తీశాడు మిచెల్ మార్ష్...
బిగ్బాష్ లీగ్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్, మంచి ఫామ్లో ఉన్నాడు. అతను ఉండి ఉంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విధాలా జట్టుకు ఉపయోగపడేవాడు.
మరోవైపు 2017లో గుజరాత్ లయన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడిన జాసన్ రాయ్, ఐపీఎల్ కెరీర్లో 8 మ్యాచులు ఆడి 179 పరుగులు చేశాడు. మూడు సీజన్ల పాటు జాసన్ రాయ్ను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.