మయాంక్ అగర్వాల్ సెంచరీ మిస్... భారీ స్కోరు చేయలేకపోయిన పంజాబ్ కింగ్స్...
కెఎల్ రాహుల్ గైర్హజరీతో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్, అద్భుత హాఫ్ సెంచరీతో రాణించి పంజాబ్ కింగ్స్ను ఆదుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్లో తొలి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ, పరుగులేమీ ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మొదటి ఓవర్ మెయిడిన్ కావడంతో ఒత్తిడికి గురైన యంగ్ బ్యాట్స్మెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 16 బంతుల్లో ఓ సిక్స్తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ప్రభ్సిమ్రాన్ను అవుట్ చేసిన రబాడా, క్రిస్ గేల్ వికెట్ తీశాడు. 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 13 పరుగులు చేసిన క్రిస్గేల్ను రబాడా క్లీన్ బౌల్డ్ చేశాడు. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్...
ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలాన్... 26 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 26 పరుగులు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో మలాన్ బౌల్డ్ కావడంతో 52 పరుుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్ మధ్య సమన్వయం లోపించడంలో హుడా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత షారుక్ ఖాన్ 4 పరుగులు చేసి అవుట్ కాగా జోర్డాన్ 2 పరుగులు చేశాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. 58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు చేసి మయాంక్ అగర్వాల్... ఆఖరి ఓవర్ ఆఖరి మూడు బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదినా సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు.
పంజాబ్ కింగ్స్తో ఐపీఎల్ 2021 సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో 119 పరుగులు చేసిన సంజూ శాంసన్ తర్వాత కెప్టెన్గా తొలి మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రెండో స్థానంలో నిలిచాడు మయాంక్ అగర్వాల్.