- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ కెప్టెన్సీ, టీమిండియా కెప్టెన్సీ రెండూ ఒక్కటేనా... రోహిత్ శర్మ విషయంలో వర్కవుట్ అయినట్టు...
ఐపీఎల్ కెప్టెన్సీ, టీమిండియా కెప్టెన్సీ రెండూ ఒక్కటేనా... రోహిత్ శర్మ విషయంలో వర్కవుట్ అయినట్టు...
ఐపీఎల్ 2022 సీజన్లో పూర్తి డామినేషన్ చూపిస్తూ, టైటిల్ ఎగరేసుకుపోయింది గుజరాత్ టైటాన్స్. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు 15 సీజన్లుగా టైటిల్ కోసం అష్టకష్టాలు పడుతుంటే, ఆరంగ్రేటం సీజన్లో టైటాన్స్ టైటిల్ గెలవడంతో హార్ధిక్ పాండ్యా టాక్ ఆఫ్ ది ఫీల్డ్ అయ్యాడు...

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీకి హార్ధిక్ పాండ్యానే కరెక్ట్ అంటూ వాదనలు అప్పుడే మొదలైపోయాయి. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దాకా చాలామంది హార్ధిక్ పాండ్యానే టీమిండియా కెప్టెన్సీకి సరైనోడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు...
అయితే ఐపీఎల్లో టైటిల్ గెలవడం, టీమిండియాని నడిపించడం రెండూ ఒక్కటేనా! ఐపీఎల్లో టైటిల్ గెలిస్తే, భారత క్రికెట్ జట్టుకి వరల్డ్ కప్ అందించే సత్తా, సామర్థ్యం ఉన్నట్టేనా... రోహిత్ శర్మకు ఇచ్చిన్నట్టుగా, హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ అప్పగించొచ్చా?
రోహిత్ శర్మ టీమిండియాలోకి వచ్చిన 14 ఏళ్ల తర్వాత కెప్టెన్సీ దక్కించుకోగలిగాడు. 2006లో అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ, కెప్టెన్సీ కోసం కొన్ని దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్కి ప్రమోషన్ రావడంతో అతని కెరీర్ మారిపోయింది..
ముంబై ఇండియన్స్కి 8 సీజన్లలో 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ టీమ్లో సభ్యుడిగా ఉన్న హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు ఆ జట్టు నుంచి బయటికి వచ్చి కెప్టెన్గా ఐపీఎల్ టైటిల్ గెలిచేశాడు...
అయితే ఐపీఎల్ టైటిల్ గెలిచినంత ఈజీగా అంతర్జాతీయ స్థాయిలో టోర్నీలో గెలవలేం. ఎందుకంటే ఐపీఎల్లో ఫారిన్ ప్లేయర్లతో టీమ్ కాంబినేషన్ని నిర్మించుకునే సౌకర్యం ఉంటుంది. తుదిజట్టుని నిర్మించుకునేందుకు అవసరమైనంత స్వేచ్ఛ, ఆప్షన్లు ఉంటాయి...
అలాగే ఐపీఎల్లో 4 మ్యాచులు ఓడిపోయిన తర్వాత కూడా జట్టులో కావాల్సిన మార్పులు, చేర్పులు చేసుకుని తిరిగి విజయాలు అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి సౌకర్యాలు ఉండవు... ముఖ్యంగా భారత జట్టులో 11 మందితో కూడా తుదిజట్టు ప్లేయర్లను ఎంపిక చేయడమే కత్తిమీద సాము...
అలాగే టీమ్ సెలక్షన్లో మేనేజ్మెంట్, సెలక్టర్లదే తుది నిర్ణయం. వాళ్లు చెప్పిన, ఇచ్చిన ప్లేయర్లతోనే సిరీస్లు ఆడాల్సి ఉంటుంది. అదీకాకుండా ఐపీఎల్లో ఉన్నట్టుగా ఐసీసీ టోర్నీల్లో వరుస మ్యాచులు ఓడిన తర్వాత తిరిగి కమ్బ్యాక్ ఇచ్చేంత తీరిక ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిన పరిస్థితులు ఉంటాయి...
అన్నింటినీ మించి హోం కండీషన్స్, పిచ్ కండీషన్స్, టీమ్ వాతావరణం ఇవన్నీ ఒకేలా ఉండవు. టైటాన్స్లో యష్ దయాల్, సాయి కిషోర్ వంటి కుర్రాళ్లకు చోటు దక్కినట్టుగా టీమిండియాలో అంతర్జాతీయ అనుభవం లేని వాళ్లను ఐసీసీ టోర్నీల్లో ఆడించడం వీలయ్యే పని కాదు..
ఐపీఎల్లో సక్సెస్ అయిన గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ దక్కించుకోలేకపోయాడు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో సూపర్ సక్సెస్ అయిన ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్ వంటి వాళ్లు ఐపీఎల్లో సక్సెస్ కాలేకపోయారు..
ఐపీఎల్, టీమిండియా కెప్టెన్సీ రెండూ ఒక్కటేనా... ఐపీఎల్లో సక్సెస్ అయితే అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ ఇవ్వొచ్చా? లేదా అనే ప్రశ్నకు మరికొద్ది రోజుల్లో తిరుగులేని సమాధానం దొరకనుంది. ఐపీఎల్లో కెప్టెన్గా ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడనుంది భారత జట్టు..
ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్లో హాట్ ఫెవరెట్గా బరిలో దిగుతున్న టీమిండియా, టైటిల్ ఛాంపియన్గా నిలిస్తే... రోహిత్ శర్మ వెనకే హార్ధిక్ పాండ్యా కూడా భారత జట్టు కెప్టెన్సీ రేసులో నిలవచ్చు...