కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరు, లోగో మార్పు... 2021 సీజన్లో సరికొత్తగా ప్రీతీ జింటా జట్టు...
గత 13 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన జట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒకటి. 2014లో ఫైనల్ చేరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత ఫైనల్కి కూడా అర్హత సాధించలేకపోయింది. గత సీజన్లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో గెలిచిన పంజాబ్, 2021 సీజన్ ఆరంభానికి ముందు పలు మార్పులు చేయాలని భావిస్తోంది.
గత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి కెప్టెన్గా వ్యవహారించాడు భారత యంగ్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్. రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు తొలుత ఏడు మ్యాచుల్లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడిన మొట్టమొదటి మ్యాచ్లోనే ‘సూపర్ ఓవర్’ ఆడిన పంజాబ్, సూపర్ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా ఓడింది...
ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో కూడా పంజాబ్ పాల్గొంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ సూపర్ ఓవర్లోనూ టైగా ముగిసి, డబుల్ సూపర్ ఓవర్కి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్ కలిసి పంజాబ్కి విజయాన్ని అందించారు.
క్రిస్ గేల్ లాంటి భారీ హిట్టర్ ఉన్నప్పటికీ అతన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సీజన్ మొత్తంలో ఒక్క సిక్స్ కొట్టలేకపోయినా గ్లెన్ మ్యాక్స్వెల్కి 13 మ్యాచుల్లో ఆడించింది. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాల కారణంగానే ఐపీఎల్ 2020 సీజన్లో ఆరో స్థానానికే పరిమితమైంది పంజాబ్...
తేలిగ్గా గెలవాల్సిన మ్యాచులను కూడా చివరిదాకా తెచ్చుకుని ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2021 సీజన్లో జట్టు పేరు, లోగోలో మార్పులు చేయాలని చూస్తోంది. ఐపీఎల్ మినీ వేలం జరిగే ఒక్క రోజు ముందు అంటే ఫిబ్రవరి 17న కొత్త లోగో, కొత్త పేరును ప్రకటించబోతోంది ప్రీతి జింటా జట్టు...
ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు పేరు, లోగో మార్చిన తర్వాత మంచి ప్రదర్శన కనబర్చింది. 2019లో ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ, 2020లో తొలిసారిగా ఫైనల్కి కూడా అర్హత సాధించింది. అలాగే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లోగో, పేరు మారిస్తే లక్ కలిసి వస్తుందని ఆశిస్తోంది ప్రీతి జింటా... అయితే ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఎలెవన్గా ఉన్న పేరును కింగ్స్ ఎలెవన్ పంజాబ్గా ఓసారి మార్చింది ఈ ఫ్రాంఛైజీ.
టైటిల్ గెలవలేకపోయినప్పటికీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2020 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు రాహుల్. అయితే ఆరెంజ్ క్యాప్ విషయంలో తనకి పోటీగా వస్తున్నాడని మయాంక్ అగర్వాల్నే పక్కనబెట్టి, విమర్శల పాలయ్యాడు రాహుల్.
ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పర్సులో అత్యధికంగా రూ.53.2 కోట్లు ఉన్నాయి. గత ఏడాది రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన మ్యాక్స్వెల్ను, రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసిన షెల్డన్ కాంట్రెల్ను వదిలించుకుంది పంజాబ్. వీరితో పాటు కరణ్ నాయర్ రూ.5.60 కోట్లు, ముజీద్ రెహ్మన్ రూ.4 కోట్లు కూడా వేలానికి విడుదల చేసింది పంజాబ్...
టీ20ల్లో అదరగొడుతున్న డేవిడ్ మలాన్ వంటి స్టార్ ప్లేయర్ కోసం ఎదురుచూస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2021 వేలంలో ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంది. 2021 మినీ వేలంలో ఓ ఆటగాడి కోసం అత్యధిక ధర వెచ్చించిన జట్టుగా పంజాబ్ నిలిచే అవకాశం ఉంది.