‘కింగ్ ఈజ్ బ్యాక్’... రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్తో ఫ్యాన్స్ ఫిదా...
మ్యాచులు గెలుస్తున్నా, ఓ బ్యాట్స్మెన్గా వరుసగా ఫెయిల్ అవుతూ, తనదైన మార్కు వేయలేకపోతున్న భారత సారథి విరాట్ కోహ్లీ... ఎట్టకేలకు తనదైన స్టైల్లో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కమ్బ్యాక్ను ఘనంగా చాటుకున్నాడు...
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 12 పరుగుల వద్ద కీపర్ జోస్ బట్లర్ క్యాచ్ అందుకోలేకపోవడంతో లైఫ్ అందుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆరంగ్రేట బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఇచ్చిన ఊపుతో తనదైన మార్కుతో బౌండరీల మోత మోగించాడు...
49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో 3 వేల పరుగులు అందుకున్న మొట్టమొదటి క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. 87వ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 81 ఇన్నింగ్స్ల్లో 3001 పరుగులు చేశాడు...
న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్టిన్ గుప్టిల్ 99 మ్యాచుల్లో 95 ఇన్నింగ్స్ల్లో 2839, రోహిత్ శర్మ 108 మ్యాచుల్లో 100 ఇన్నింగ్స్ల్లో 2773 పరుగులు చేసి టాప్ 3లో ఉన్నారు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్ 2346, షోయబ్ మాలిక్ 2335 పరుగులతో ఉన్నారు. అయితే వీరిలో 50+ సగటు ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ...
అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ 25 హాఫ్ సెంచరీలతో ఉండగా తాజా ఫిఫ్టీతో అతన్ని అధిగమించిన విరాట్ కోహ్లీ 26వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...
తన 26 హాఫ్ సెంచరీల్లో 18, కేవలం చేధనలో రావడం విశేషం. ఇందులో 14సార్లు టీమిండియాకు విజయాన్ని అందించాడు విరాట్ కోహ్లీ... చేధనలో 37 ఇన్నింగ్స్ల్లో 1759 పరుగులు చేశాడు కోహ్లీ. ఛేజింగ్లో కోహ్లీ సగటు 83.76 కాగా, స్ట్రైయిక్ రేటు 137.20...
టీ20 లక్ష్యచేధనలో అత్యధిక సార్లు టాప్ స్కోరర్గా నిలిచిన బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీయే. కోహ్లీ 18సార్లు టాప్ స్కోరర్గా నిలిస్తే డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, మార్టిన్ గుప్టిల్ 12సార్లు ఈ ఫీట్ సాధించారు...
సిక్సర్తో టీ20 మ్యాచ్ను ముగించడం విరాట్ కోహ్లీకి ఇది మూడోసారి. టీమిండియా తరుపున హార్ధిక్ పాండ్యా మాత్రమే రెండుసార్లు సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. అయ్యర్, దూబే తలా ఓ సారి ఈ ఫీట్ సాధించారు...
అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో 1987లో సునీల్ గవాస్కర్ టెస్టుల్లో 10 వేల మైలురాయిని అందుకోగా, 2009లో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయంగా 30 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్గా నిలిచాడు. 2011లో ఇక్కడే 18 వేల వన్డే పరుగులు చేసిన మొదటి క్రికెటర్గా నిలిచాడు సచిన్. మళ్లీ 10 ఏళ్లకు ఇక్కడే విరాట్ కోహ్లీ టీ20ల్లో 3 వేల పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్మెన్గా నిలిచాడు.
మూడు ఫార్మాట్లలో 50+ సగటు ఉన్న ఒకే ఒక్క బ్యాట్స్మెన్గా మళ్లీ నిలిచాడు విరాట్ కోహ్లీ. గత మ్యాచ్లో డకౌట్ కావడంతో టీ20ల్లో అతని సగటు 50లోపు పడిపోగా తర్వాతి మ్యాచ్లో అద్భుత కమ్బ్యాక్తో మళ్లీ 50+ సగటు నమోదుచేశాడు కోహ్లీ..
టీ20ల్లో అత్యధిక పరుగులు, అత్యధిక సగటు, అత్యధిక హాఫ్ సెంచరీలు మాత్రమే కాకుండా అత్యధిక ఫోర్లు (270), అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ (12), ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ (ఆరు సార్లు) రికార్డులు కూడా విరాట్ కోహ్లీ ఖాతాలోనే ఉన్నాయి.