బుమ్రా లేకపోవడం మాకు పెద్ద లోటు.. కానీ అతడింకా కోలుకోవాలి : హార్ధిక్ పాండ్యా
Jasprit Bumrah: టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఆసియా కప్ కు ముందు గాయమైంది. ఇటీవలే అతడు ఫిట్నెస్ టెస్టు పాసైనా ఆస్ట్రేలియాతో తొలి టీ20 మాత్రం ఆడలేదు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొహాలీలో ముగిసిన టీ20లో భారత్ బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసినా బౌలింగ్ లో మాత్రం విఫలమైంది. 208 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. అయితే ఈ సిరీస్ కు ఎంపికైన బుమ్రా.. నిన్నటి మ్యాచ్ లో ఎందుకు ఆడలేదనే దానిమీద జోరుగా చర్చలు సాగుతున్నాయి.
తొలి మ్యాచ్ లో అతడు ఆడకపోవడం గురించి టాస్ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. బుమ్రా ఈ మ్యాచ్ ఆడటం లేదని, వచ్చే రెండు మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో ఉంటాడని తెలిపాడు. అయితే జట్టులోకి ఎంపిక చేసి బుమ్రాకు ఎందుకు రెస్ట్ ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా నిన్నటి మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ లో బుమ్రా లేనిలోటు స్పష్టంగా కనిపించింది.
Image credit: Getty
అయితే అతడు గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పూర్తి స్థాయిలో కోలుకుని రిథమ్ అందుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మేం ఇప్పుడే బుమ్రా మీద ఒత్తిడి పెట్టదలుచుకోలేదు. అది జట్టుకూ మంచిది కాదు.
hardik
ఎందుకంటే బుమ్రా ఎంత కీలక ఆటగాడనేది మా అందరికీ తెలుసు. కానీ మా జట్టు బౌలింగ్ పై ఆందోళనలు ఉన్నాయని మాకు తెలుసు. మేం మా బౌలర్లను విశ్వసిస్తాం..’ అని తెలిపాడు.
ఈ మ్యాచ్ లో భారత్ 208 పరుగులు చేసినా ఆసీస్ బ్యాటర్లు దానిని 19.2 ఓవర్లలోనే ఊదిపారేశారు. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్ లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు.
టీమిండియా ప్రధాన బౌలర్లైన భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. అతడు వేసిన చివరి రెండు ఓవర్లలో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ వీరవిహారం చేసి మ్యాచ్ ను కంగారూల వైపునకు మళ్లించాడు. హర్షల్ పటేల్.. 4 ఓవర్లలో 49 పరుగులిచ్చాడు. నిన్నటి మ్యాచ్ లో ఈ ఇద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేదు.