అతనికి బౌలింగ్ చేయడం, క్లబ్లో అమ్మాయిని పడేసినంత కష్టం... జేమ్స్ అండర్సన్ కామెంట్...
క్రికెట్లో ఎన్ని టోర్నీలు ఉన్నా, యాషెస్ సిరీస్కి ఉండే క్రేజ్ వేరు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో కూడా ఈ సిరీస్ను ఆసక్తిగా చూస్తారు. కౌంటీ ఛాంపియన్షిప్లో తలబడుతున్న ఇంగ్లాండ్, ఆసీస్ క్రికెటర్లు... యాషెస్ సిరీస్కి ప్రాక్టీస్లా పాల్గొంటున్నారు...
గాయం కారణంగా 2019 యాషెస్ సిరీస్కి దూరమయ్యాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్. 160 టెస్టులు ఆడి 614 వికెట్లు తీసిన అండర్సన్, ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
2019 యాషెస్ సిరీస్లోనే గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో కంకూషన్ సబ్స్టిట్యూట్గా జట్టులో స్థానం దక్కించుకున్నాడు మార్నస్ లబుషేన్. అలా అనుకోకుండా జట్టులోకి వచ్చిన లబుషేన్, టెస్టు క్రికెట్లో ఫ్యూచర్ స్టార్గా గుర్తింపు దక్కించుకున్నాడు.
మార్నస్ లబుషేన్కి అంతర్జాతీయ మ్యాచులో ఇప్పటిదాకా బౌలింగ్ వేయలేదు జేమ్స్ అండర్సన్. కౌంటీ ఛాంపియన్షిప్లో తొలిసారి లబుషేన్కి బౌలింగ్ చేసిన అండర్సన్, ఈ యంగ్ బ్యాట్స్మెన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘లబుషేన్తో పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పోటీలో మంచి ఇంప్రెషన్ సాధించాలంటే ముందుగానే ఆధిక్యాన్ని ప్రదర్శించే స్టాంప్ ముద్రించాలి. నేను ఇంతవరకూ అతనికి బౌలింగ్ చేయలేదు.
అతనికి బౌలింగ్ చేయడం క్లబ్లో ఓ అమ్మాయిని చూసి, ఇష్టపడితే ఆమెను ఇంప్రెస్ చేయడంలా ఉంటుంది. ఆమె, మన మాయలో పడిపోవడానికి చేయాల్సినవన్నీ చేయాలి... గులాబీలు చల్లుతూ ఆమెను ఆకట్టుకోవాల్సి ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు అండర్సన్.
డిసెంబర్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కి ప్రధాన ఆటగాళ్లను సిద్ధంగా ఉంచేందుకు రొటేషన్ పద్దతిని ఫాలో అవుతోంది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.
ఈ పద్ధతిలో భాగంగానే 38 ఏళ్ల జేమ్స్ అండర్సన్, 34 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ వంటి ప్లేయర్లకు తగినంత విశ్రాంతినిచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఐపీఎల్ ఆడిన ప్లేయర్లకు న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్లో చోటు కల్పించలేదు.