టీమిండియా భవితవ్యం వారి చేతుల్లోనే.. అతడిని కరెక్ట్గా వాడుకుంటే : ఇషాంత్ శర్మ
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు బౌలింగ్ యూనిట్ లో పలు మార్పులు జరిగాయి. షమీ, ఉమేశ్ ల స్థానంలో సెలక్టర్లు నవ్దీప్ సైనీ, ముఖేశ్ కుమార్లను ఎంపిక చేశారు.
టీమిండియాకు టెస్టు జట్టులో గత ఏడేనిమిదేండ్లలో మహ్మద్ షమీ, బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ల తర్వాత గడిచిన రెండు మూడేండ్లుగా మహ్మద్ సిరాజ్ కూడా పేస్ విభాగంలో రాణిస్తున్నాడు. అయితే సిరాజ్ తర్వాత ఆ స్థాయి పేసర్ భారత జట్టుకు దొరకడం లేదు.
అర్ష్దీప్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ వంటి కొంతమంది వచ్చినా వాళ్లు టీ20లకే పరిమితమవుతున్నారు. అయితే ఇషాంత్ శర్మకు వయసు భారం రీత్యా జట్టులో చోటు దక్కకపోవడం, బుమ్రాకు గాయాలు, ఉమేశ్ యాదవ్ వైఫల్యాల నేపథ్యంలో భారత జట్టు విదేశాలలో దారుణమైన పరాజయాలను మూటగట్టుకుంటున్నది.
ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పేస్ బౌలింగ్ వైఫల్యం కూడా భారత ఓటమికి ఒక కారణమైంది. ఇక తాజాగా వెస్టిండీస్ టూర్ లో ఆడబోయే టెస్టు జట్టులో పలు మార్పులు జరిగాయి. షమీకి సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. సిరాజ్ పేస్ బౌలింగ్ కు నేతృత్వం వహించనున్నాడు.
అతడికి జతగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ముఖేశ్ కుమార్ కు కూడా జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఇండియన్ బౌలింగ్ యూనిట్ గురించి వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇషాంత్ మాట్లాడుతూ... ‘ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ లను సరిగా ఉపయోగించుకుంటే వాళ్లు చాలాకాలం పాటు భారత్ కు మెరుగైన ప్రదర్శనలు చేయగలరు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు నాతో పాటు ఆడిన ముఖేశ్ కుమార్ గురించి చాలా మందికి తెలియదు. అతడు చాలా డౌన్ టు ఎర్త్. సింపుల్ గా ఉంటాడు.
ముఖేశ్ ను మాకు ఫలానా డెలివరీ వేయమని అడిగితే అదే వేస్తాడు. అతడికి సరైన మార్గ దర్శకత్వం అవసరం. అతడిని బాగా గైడ్ చేయగలిగితే ముఖేశ్ అద్భుతాలు సృష్టించగలడు. ఐపీఎల్ -16 లో అతడు భారీగా పరుగులిచ్చాడని అందరూ అంటున్నారు.కానీ అతడు ఎలా బౌలింగ్ చేశాడు..? ఏ బ్యాటర్ కు బౌలింగ్ చేశాడనేది మాత్రం ఎవరూ చూడరు..? ముఖేశ్ ను సరిగ్గా వాడుకోగలిగితే అతడు భారత జట్టుకు మంచి ఫాస్ట్ బౌలర్ అవుతాడు..’అని అన్నాడు.