IPL: ఐపీఎల్ లోకి ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ సారథి ఎంట్రీ..? అతడి రెస్పాన్స్ ఇదే..
IPL-Joe Root: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ కు ముందు ఫిబ్రవరి లో జరుగబోయే మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్నది. దీంతో పలువురు ఆటగాళ్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ లో భాగమయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
పేరుకు పేరు డబ్బుకు డబ్బు.. ఏ విధంగా చూసుకున్నా అనుకూలతలు ఉండే క్యాష్ రిచ్ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడేందుకు భారత క్రికెటర్లే కాదు.. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ బ్యాటర్ గా గుర్తింపు దక్కించుకున్నా ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ మాత్రం ఇంతవరకు ఐపీఎల్ లో ఆడలేదు.
కానీ ఈసారి అతడు ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని గతంలోనే వార్తలు వినిపించాయి. ఇక తాజాగా.. అతడు ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రూట్ స్పష్టతనిచ్చాడు.
‘నేను ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశమైతే ఉంది. దీనిమీద ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు. అయితే అది (ఐపీఎల్ లో పాల్గొనడం) నా టెస్టు కెరీర్ పై ప్రభావం చూపకూడదు. అలా అనిపించినప్పుడే నేను వేలంలోకి వెళ్తా..
ఐపీఎల్ కంటే నాకు ఇంగ్లాండ్ కు ఆడటం ముఖ్యం. ఈ టోర్నీ (ఐపీఎల్) వల్ల నేను టెస్టు క్రికెట్ కు దూరం కానని నేను అనిపించినప్పుడే అందులో ఆడటానికి ఆలోచిస్తా. నేనే కాదు.. ప్రతి క్రికెటర్ కూడా ఇలాగే ఆలోచించాలి.. ’ అని రూట్ అన్నాడు.
2011 లో రూట్.. ఇంగ్లాండ్ తరఫున టీ20 క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అతడు 83 టీ20లు ఆడి 32.16 సగటుతో 1,994 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2019లో అతడు.. పాకిస్థాన్ తో చివరిసారిగా టీ20 ఆడాడు.ఇక ఇంగ్లాండ్ లో ఇటీవలే ముగిసిన ది హండ్రెడ్ లీగ్ తొలి ఎడిషన్ లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ తరఫున రూట్ ఆడాడు.
టీ20 క్రికెట్ పక్కనబెడితే టెస్ట్ క్రికెట్ లో రూట్ భీకర ఫామ్ లో ఉన్నాడు. జట్టుగా ఇంగ్లాండ్ ఓడిపోతున్నా రూట్ మాత్రం మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. గతేడాది టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
క్యాలెండర్ ఈయర్ లో 1700 కు పైగా రన్స్ సాధించి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. రూట్ ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇప్పటికే ఆ జట్టు మూడు టెస్టులు ఓడిపోయి సిరీస్ కూడా కోల్పోయింది. నాలుగో టెస్టును అతి కష్టం మీద డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్ మెగా వేలం దగ్గరపడుతున్న కొద్దీ పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఈసారి వేలంలో పాల్గొనాలని చూస్తున్నట్టు సమాచారం. స్టార్క్ చివరిసారిగా 2015లో ఆర్సీబీ తరఫున ఆడాడు.