IPL2021 MI vs PBKS: ముంబై ఘన విజయం... పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం...
ఐపీఎల్ 2021 సెకండాఫ్లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక సమయంలో మంచి విజయంతో కమ్బ్యాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ముంబై...
136 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కి శుభారంభం దక్కలేదు. 10 బంతుల్లో ఓ ఫోర్తో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మను రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు...
రోహిత్ శర్మ అవుటైన తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ను క్లీన్బౌల్డ్ చేశాడు రవిభిష్ణోయ్. 16 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్...
గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా వరుసగా రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకి అవుట్ కాని సూర్యకుమార్ యాదవ్, గత ఐదు ఇన్నింగ్స్లలో డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయాడు...
క్వింటన్ డి కాక్, సౌరభ్ తివారి కలిసి మూడో వికెట్కి 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 29 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన డి కాక్ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు...
ఆ తర్వాత 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన సౌరభ్ తివారి, నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో కెఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
షమీ వేసిన 17వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా ఓ ఫోర్, ఓ సిక్స్ బాదగా, అర్ష్దీప్ సింగ్ వేసిన 18వ ఓవర్లో పోలార్డ్ ఓ ఫోర్, సిక్సర్తో అదరగొట్టాగా... 19వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు హార్ధిక్ పాండ్యా...
హార్ధిక్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేయగా, కిరన్ పోలార్డ్ 7 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్తో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచారు...
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐదో స్థానానికి ఎగబాకగా, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పంజాబ్ కింగ్స్ మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచి, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్న కేకేఆర్, ముంబై మిగిలిన మూడు మ్యాచుల్లో కనీసం రెండు ఓడితేనే... పంజాబ్కి అవకాశం ఉంటుంది...