IPL 2022: హమ్మయ్య.. ఐపీఎల్ నూ చూస్తున్నారు.. భారీగా పెరిగిన వ్యూయర్షిప్
TATA IPL 2022: గడిచిన నెల రోజులుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ధనాధన్ ధమాకా ఐపీఎల్ 2022 ను చూసేవాళ్లు కరువయ్యారనే వార్తలు వస్తున్న వేళ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) గుడ్ న్యూస్ చెప్పింది.

నెల రోజులుగా భారత్ తో పాటు సుమారు 125 దేశాలలో ప్రసారమవుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులకు బార్క్ గుడ్ న్యూస్ చెప్పింది.
తొలి మూడు వారాల్లో ఐపీఎల్ ను చూసేవారే లేరని, టీవీలలో ఐపీఎల్ ప్రసారమవుతున్న ఛానెళ్లకు పెద్దగా రేటింగ్ లేదని వార్తలు వచ్చాయి. ఈ మేరకు బార్క్ విడుదల చేసిన టీవీ ఛానెళ్ల రేటింగ్స్ కూడా ఇదే విషయాన్ని రుజువు చేశాయి.
అయితే 16వ వారం మాత్రం స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానెల్ ను చూసేవాళ్లు అనూహ్యంగా పెరిగారు. లీగ్ రెండో దశకు చేరుకోవడం.. చెన్నై-ముంబై, బెంగళూరు-హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక మ్యాచుల కారణంగా స్టార్ స్పోర్ట్స్ కు వ్యూయర్షిప్ భారీగా పెరిగింది.
బార్క్ తాజా నివేదిక ప్రకారం.. 16వ వారంలో స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానెల్ నెంబర్ వన్ గా నిలిచింది. సన్ టీవీ, స్టార్ మా (ఇది కూడా స్టార్ వాళ్లదే) ను వెనక్కి నెట్టి మరీ స్టార్ స్పోర్ట్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ వారంలో స్టార్ స్పోర్ట్స్ హిందీని చూసే వాళ్ల (గత మూడు వారాలతో పోలిస్తే) 9 శాతం పెరిగింది.
గతేడాది(2021 సీజన్) తో పోల్చితే ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యాక తొలి వారం 33 శాతం వ్యూయర్షిప్స్ తగ్గగా.. రెండోవారం 28 శాతానికి తగ్గాయి. ఇక మూడో వారం కూడా అదే రిపీట్ అయింది. కానీ నాలుగో వారం మాత్రం ఐపీఎల్ ను చూసేవారి సంఖ్య పెరగడంతో స్టార్ నెట్వర్క్, బీసీసీఐ, ఐపీఎల్ లు ఊపిరిపీల్చుకున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్ కు ఏకంగా 9 ప్రసారదారులు ఉన్నారు. అప్స్టాక్స్, సీయట్, స్విగ్గీ, రూపే, అన్ అకాడమీ వంటివాటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆరామ్కో కూడా చేరింది. దీంతో అడ్వర్టైజ్మెంట్ల మీద ఈ సంస్థలు భారీగా ఖర్చు పెడుతున్నాయి. అయితే ఎంత ఖర్చు పెట్టినా జనం చూడకుంటే అది వృథా ప్రయాసే.
దీంతో ఐపీఎల్, బీసీసీఐ, డిస్నీ స్టార్ లు వ్యూయర్షిప్ మీద ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలాగే కొనసాగితే కష్టమని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం. కానీ నాలుగో వారం నుంచి వ్యూయర్షిప్స్ పెరగడంతో ఐపీఎల్ నిర్వాహకుల ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా బీసీసీఐ అధికార ప్రసారదారు డిస్నీ స్టార్ కు ఇదే ఆఖరి ఐపీఎల్. స్టార్ గడువు ఈ ఏడాది (2018-2023)తో ముగియనుంది. వచ్చే ఏడాది కొత్త ప్రసారదారు రానుంది.
కాగా, వచ్చే ఏడాది లో కూడా వీటిని దక్కించుకునేందుకు డిస్నీ స్టార్ బిడ్ వేసింది. కానీ ఈసారి వేలంలో అమెజాన్, రిలయన్స్ (వయకామ్18), సోని వంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా రూ. 50వేల కోట్లు ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకున్నది.