- Home
- Sports
- Cricket
- IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం.. ఆ తేదీకల్లా ముంబైలో ఉండాల్సిందే.. కఠిన ఆంక్షలు విధింపు
IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం.. ఆ తేదీకల్లా ముంబైలో ఉండాల్సిందే.. కఠిన ఆంక్షలు విధింపు
IPL 2022 Schedule: కరోనా కాలంలో జరుగుతున్న మూడో ఐపీఎల్ ఇది. గత రెండు సీజన్ల మాదిరిగా కాకుండా కొత్త ఫార్మాట్ లో జరుగుతున్న 2022 ఐపీఎల్ సీజన్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ నడుం కట్టింది.

ఈనెల 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ప్రారంభం కాబోయే ఐపీఎల్-15 సీజన్ కు సర్వం సిద్ధమవుతున్నది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నది. మెగా టోర్నీకి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో లీగ్ లోని పది జట్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
జట్లన్నీ ఈనెల 8 లోపు ముంబైకు చేరుకోవాలని తెలిపింది. కోచింగ్, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా జట్లతో వెళ్తారు.
బయో బబుల్ లో కఠిన ఆంక్షల నడుమ జరుగనున్న ఈ ఐపీఎల్ లో మార్చి 8 లోపు ముంబైకి చేరబోయే జట్ల ప్రతినిధులు.. మూడు రోజుల పాటు క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది.
ఇక మార్చి 14-15 వ తేదీ కల్లా అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చునని బీసీసీఐ ఆదేశించింది. అయితే తమ తమ జట్లతో చేరబోయే భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు.. విదేశీ ఆటగాళ్లైతే కచ్చితంగా ఐదు రోజుల పాటు క్వారంటైన్ గడపాల్సిందే.
ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్డును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఇది జట్ల ప్రతినిధులు కోచ్ లు, సహాయక సిబ్బంది, ఆటగాళ్లు.. అందరికీ వర్తిస్తుంది.
ఈ మేరకు ప్రత్యేకంగా కేటాయించిన హోటల్స్ లో అన్ని ఏర్పాట్లతో కూడిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్టు సమాచారం. క్వారంటైన్ లో ఉండే అందరికీ ప్రతిరోజు టెస్టులను నిర్వహిస్తారు. ఈ మేరకు బీసీసీఐ వైద్య బృందం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.
ఇదిలాఉండగా.. ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియంలో తలో 20 మ్యాచులు జరుగనుండగా.. బ్రబోర్న్ లో 15, పూణె స్టేడియంలో 15 మ్యాచులు జరుగుతాయి.
ఈనెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమాంగ్ అమిన్.. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రేతో పాటు మరో మంత్రి ఏక్నాథ్ షిండే తో కలిసి సమావేశమయ్యారు. ఐపీఎల్-15 నిర్వహణకు ప్రభుత్వ సహకారం కావాలని అమిన్ కోరారు.
దీంతో ఈ మెగా టోర్నీకి తమ ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని థాక్రే హామీ ఇచ్చారు. ఐపీఎల్ జట్లు ప్రయాణించడానికి వీలుగా.. గ్రీన్ కారిడర్ (ట్రాఫిక్ లేకుండా చేయడం) ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.