- Home
- Sports
- Cricket
- అతనితో మాట్లాడకంటూ గౌతీ సైగలు! గంభీర్తో గొడవ పెట్టుకున్న విరాట్ కోహ్లీ... అప్పుడు జరిగిన దానికి...
అతనితో మాట్లాడకంటూ గౌతీ సైగలు! గంభీర్తో గొడవ పెట్టుకున్న విరాట్ కోహ్లీ... అప్పుడు జరిగిన దానికి...
విరాట్ కోహ్లీకి కోపం చాలా ఎక్కువ. ఆవేశం వస్తే, విరాట్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ దూకుడే, టీమిండియా కెప్టెన్గా టెస్టుల్లో అనేక విజయాలు తెచ్చిపెట్టింది. ఇదే దూకుడు అతని కెప్టెన్సీ పోవడానికి కూడా కారణమైంది. ఢిల్లీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే బాపతు. ఇద్దరూ కలిస్తే అక్కడ రచ్చ జరగాల్సిందే.

తాజాగా మరోసారి తన దూకుడైన ప్రవర్తనతో ట్రెండింగ్లో నిలిచారు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ... లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన రెండో మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం అందుకుంది..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, 126 పరుగులే చేయగలిగినా బౌలింగ్కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్పై లక్నో సూపర్ జెయింట్స్ 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీకి 18 పరుగుల తేడాతో విజయం దక్కింది.
ఈ మ్యాచ్లో రెండు కీలక క్యాచులు పట్టుకున్న విరాట్ కోహ్లీ, బ్యాటుతో 31 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్తో కోహ్లీ మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన గంభీర్, అతనితో మాట్లాడకని సైగ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనికి కోహ్లీ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది.
అమిత్ మిశ్రాతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్తో పాటు లక్నో టీమ్ ప్లేయర్లంతా కలిసి విరాట్ కోహ్లీకి సర్ది చెప్పి, అతన్ని వెనక్కి పంపించారు. ఈ గొడవకి కారణం ఈ రెండు టీమ్స్ మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచేనని తెలుస్తోంది..
బెంగళూరులో ఆర్సీబీని 1 వికెట్ తేడాతో ఓడించింది లక్నో. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి లక్నో గెలవగానే గౌతమ్ గంభీర్, ఆర్సీబీ ఫ్యాన్స్ వైపు నోరు మూసుకోవాల్సిందిగా సైగ చేశాడు. ఇదే కోహ్లికి కోపం తెప్పించింది. నేటి మ్యాచ్లో రెండు క్యాచులు అందుకున్నాక కోహ్లీ, ఇదే టైపులో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది గంభీర్కి కోపం తెప్పించింది.
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. 2013 సీజన్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. 10 సీజన్లు అయినా అటు విరాట్ కానీ, ఇటు గంభీర్ కానీ ఈ గొడవని మరిచిపోలేదు.