- Home
- Sports
- Cricket
- రూ. 13 కోట్లిచ్చారని 13 రన్స్ కంటే ఎక్కువ కొట్టవా బ్రూక్..? అంటే ఈ లెక్కన నువ్వు సెంచరీ చేయాలంటే..?
రూ. 13 కోట్లిచ్చారని 13 రన్స్ కంటే ఎక్కువ కొట్టవా బ్రూక్..? అంటే ఈ లెక్కన నువ్వు సెంచరీ చేయాలంటే..?
IPL 2023: ఐపీఎల్ -16 సీజన్ కు ముందు ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లు పెట్టి దక్కించుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఆటగాళ్లకు కాసుల పంట. ఇక కాస్తో కూస్తో రాణిస్తూ సెంచరీలు చేసేవాళ్లంటే మన ఫ్రాంచైజీలకు మోజు. ఇక్కడ దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా బ్యాటర్లను ప్రాంచైజీలు పెద్దగా పట్టించుకోవు. ఒకవేళ ఆడే అవకాశమిచ్చినా ఏదో బేస్ ప్రైస్ రూ. 20 లక్షలు, రూ. 50 లక్షల వద్దే వాళ్ల ప్రయాణం ముగిసిపోతుంది.
కానీ విదేశీ ఆటగాళ్ల మీద మాత్రం కోటానుకోట్లు ధారపోస్తారు. ఇంత చేసినా వీళ్లు ఆడతారా..? అంటే అదీ ఉండదు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ గతంలో చాలా ఉన్నా తాజాగా దానిని మరోసారి నిరూపితం చేస్తున్నాడు ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్స్. ఈ ఇంగ్లాండ్ టెస్టు బ్యాటర్ పై సన్ రైజర్స్ 2022 డిసెంబర్ లో కొచ్చిలో జరిగిన వేలంలో ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించింది.
బ్రూక్.. పాకిస్తాన్ పర్యటనతో పాటు న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో కూడా మెరిశాడు. కివీస్ లో సెంచరీలు బాదినప్పుడు ఎస్ఆర్హెచ్ ట్విటర్ ఖాతాలో.. ‘అబ్బ బ్రూక్.. అన్నీ సెంచరీలు ఇప్పుడేనా..? కొన్ని ఐపీఎల్ కు కూడా దాచుకో..’ అని ట్వీట్లతో హంగామా చేశారు.
ఇక బ్రూక్ వచ్చాక అతడిని ఆహా ఓహో అని కీర్తిస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. లోకలైజేషన్ కు తగ్గట్టుగా మనోడికి బోరబండ బ్రూక్ అని పేరు కూడా పెట్టారు. ఈ సీజన్ లో బ్రూక్ విశ్వరూపం చూస్తారని సన్ రైజర్స్ అభిమానులు భావించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
రూ. 13 కోట్లు పెట్టి కొన్న ఆటగాడు అందులో పావు వంతు కూడా ఆడటం లేదు. ఈ సీజన్ లో బ్రూక్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ (పంజాబ్ తో కలుపుకుని) లు ఆడాడు. ఇందులో రాజస్తాన్ తో తొలి మ్యాచ్ లో 21 బంతుల్లో 13 పరుగులు చేశాడు. లక్నోతో మ్యాచ్ లో నాలుగు బంతుల్లో 3 పరుగులే చేసి నిరాశపరిచాడు.
ఇక పంజాబ్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన బ్రూక్.. ప్లేస్ మారితే ఆట మారుతుందని అంతా భావించారు. కానీ ప్లేస్ మారినా ఫేట్ మారలేదు. మరోసారి అతడు 14 బంతుల్లో 13 పరుగులే చేశాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
బ్రూక్ మరోసారి 13 పరుగుల వద్దే నిష్క్రమించడంతో సోషల్ మీడియాలో అతడిని అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘రూ. 13 కోట్లే ఇచ్చారని 13 పరుగుల కంటే ఎక్కువ చేయొద్దని ఫిక్స్ అయ్యావా బ్రో..? ఇలా అయితే నువ్వు హాఫ్ సెంచరీనో లేక సెంచరీనో చేయాలంటే కావ్య పాప దగ్గర ఉన్న మనీ పార్స్ మొత్తం ఖాళీ కావాల్సిందేనా..?’ అంటూ ఆటాడుకుంటున్నారు. మరికొందరు అదుర్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ మీమ్ తో ఆకట్టుకుంటున్నారు. ‘ఇంగ్లాండ్ లో అయితే గ్రౌండ్ మొత్తం కొట్టినా కోటి రూపాయలు కూడా ఇవ్వరు. అదే ఇక్కడైతే ఒక్కో పరుగుకు ఒక్కో కోటి ఇస్తున్నారే నాన్నమ్మ..’ అంటూ అదుర్స్ లో డైలాగ్ తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.