ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గుడ్ న్యూస్.. లంకేయులొస్తున్నారు.. ఆ మూడు టీమ్స్లో జోష్
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫ్రాంచైజీలకు గుడ్ న్యూస్. లంక ప్లేయర్లు ఐపీఎల్ కు రాబోతున్నారు. త్వరలోనే వాళ్లు టీమ్స్ తో కలుస్తారు.

Image credit: PTI
ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు లంక క్రికెటర్లు శుభవార్త చెప్పారు. ఐపీఎల్ లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు ఆటగాళ్లు నేడో రేపో వారి టీమ్స్ తో కలవనున్నారు. గత నెలరోజులుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక.. టెస్టు,వన్డే, టీ20 సిరీస్ లను ముగించుకుంది. దీంతో ఆ జట్టులో ఉన్న టీ20 వీరులు కివీస్ నుంచి నేరుగా ఇండియాకు పయనమయ్యారు.
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 10న అతడు టీమ్ తో కలుస్తాడని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. హసరంగ లేకపోవడంతో ఆర్సీబీ.. సీనియర్ స్పిన్నర్ కర్ణ్ శర్మను ఆడిస్తున్నది.
లంకకు వన్డేలు, టీ20లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న దసున్ శనక.. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ లోకి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. గుజరాత్ టైటాన్స్.. కేన్ విలియమ్సన్ గాయపడటంతో శనకను జట్టులోకి రిప్లేస్ చేసుకుంది. గుజరాత్ తర్వాత ఆడబోయే మ్యాచ్ కు అతడు ఆడే అవకాశముంది.
ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరనలు కూడా సీఎస్కేతో కలువనున్నారు. ఈ ఇద్దరి రాకతో చెన్నై బౌలింగ్ బలం కూడా పెరగనుంది. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో తీక్షణ సిద్ధహస్తుడు. గతేడాది ఐపీఎల్ సీజన్ లో తీక్షణ సీఎస్కే తరఫున ఆడుతూ 12 వికెట్లు కూడా తీశాడు.
Image credit: Getty
పేసర్ మతీశ పతిరన వస్తుండటం చెన్నైకి శుభవార్తే. ఇప్పటికే ఆ జట్టులో అంతర్జాతీయ పేసర్ లేక తిప్పలు పడుతోంది. దీపక్ చాహర్ ముంబైతో మ్యాచ్ లో గాయపడ్డాడు. రాబోయే నాలుగైదు మ్యాచ్ లలో అతడు ఆడేది అనుమానంగానే ఉంది. తుషార్ దేశ్పాండే, రాజ్యవర్ధన్ లు పెద్దగా ప్రభావం చూపడం లేదు. మగలకు ఐపీఎల్ ఆడిన అనుభవం లేదు. దీంతో పతిరన సీఎస్కేకు కీలకం కానున్నాడు.
ఈ ఇద్దరూ వెల్లింగ్టన్ నుంచి నేరుగా చెన్నైకి నేటి రాత్రికో లేదా రేపటి వరకైనా చేరుకుంటారని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. చెన్నై.. ఈనెల 12న రాజస్తాన్ రాయల్స్ తో చెన్నై వేదికగా మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు పతిరన, తీక్షణ అందుబాటులో ఉంటారు.