ఇక అస్సాం ట్రైన్ ఎక్కడమే! సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలంటే...
ఐపీఎల్ 2021 సీజన్ అనుభవాల కారణంగా 2022లో సన్రైజర్స్ హైదరాబాద్పై ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు అభిమానులు. మొదటి రెండు మ్యాచుల్లో ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు కూడా అలాగే సాగింది.

ఇక ఈ సీజన్ కూడా దేవుడికే అనుకుని సరిపెట్టుకుంటుండగా... వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ఊహించని కమ్ బ్యాక్ ఇచ్చింది సన్రైజర్స్ హైదరాబాద్. మిగిలిన 7 మ్యాచుల్లో 3 గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ చేరిపోవచ్చని అభిమానులు ఆశలు పెంచుకోగానే ఒక్కసారి తుస్సుమనిపించింది...
వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ, పాయింట్ల పట్టికలో అథఃపాతాళానికి పడిపోయింది. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలు అందుకున్నా, సన్రైజ్ అవ్వడం కష్టమే. ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ చేరాలంటే బీభత్సమైన లక్ కలిసి రావాలి...
తర్వాతి మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచులు ఆడనుంది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ రెండూ గెలిస్తే 14 పాయింట్లతో ఉంటుంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్, తన ఆఖరి లీగ్ మ్యాచ్లో కేకేఆర్ని ఓడించి ప్లేఆఫ్స్కి చేరాలి...
అప్పుడు కేకేఆర్ ప్లేఆఫ్స్ పోటీ నుంచి తప్పుకుంటుంది. ఇక 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ చేతుల్లో చిత్తుగా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్సీబీ కూడా 14 పాయింట్లతోనే ఉంటుంది..
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్పై గెలిచి, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 14 పాయింట్లతో ఉంటుంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీపై గెలిస్తే ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ, మయాంక్ టీమ్పై భారీ తేడాతో విజయం అందుకోవాల్సి ఉంటుంది...
అప్పుడు ఆర్సీబీ, సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఉంటాయి. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్లను కన్ఫార్మ్ చేసుకోవడంతో మరీ మన నెట్ రన్రేట్ బీభత్సంగా పెరిగితే... హైదారాబాద్ ప్లేఆఫ్స్ చేరగలుగుతుంది...
ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్రైజర్స్ హైదరాబాద్... 7 లేదా 8వ స్థానంలో సీజన్ని ముగించే అవకాశం ఉంది. ఆఖరి రెండు మ్యాచుల్లో ఓడితే మరోసారి ఆఖరి పొజిషన్కి పడిపోయినా ఆశ్చర్యపోనక్కేర్లేదు...