David Warner: వార్నర్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
David Warner IPL Records: సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా వార్నర్ ఈ ఘనత అందుకున్నాడు.

ఐపీఎల్ లీగ్ లో అరుదైన ఘనతను సాధించాడు మన వార్నర్ బాబాయ్. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా ఆటగాడు.. ఐపీఎల్ లో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ఢిల్లీ-కోల్కతా మధ్య గురువారం రాత్రి వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో 26 బంతుల్లో 42 పరుగులు చేసిన వార్నర్.. ఆ జట్టుపై వెయ్యి పరుగులు (1,018) పూర్తి చేశాడు.
ఒక ఫ్రాంచైజీపై వెయ్యి పరుగులు పూర్తి చేయడం వార్నర్ కు ఇది రెండోసారి. వారం రోజుల క్రితమే అతడు పంజాబ్ కింగ్స్ పై కూడా ఇదే రికార్డు సాధించాడు. ఆ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్.. పంజాబ్ పై మొత్తంగా 1,005 పరుగులు చేశాడు.
ఇక ఒక జట్టు పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారి జాబితాలో వార్నర్ కు ముందు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ కూడా కేకేఆర్ పై 1,018 పరుగులు చేశాడు. రోహిత్ తో పాటు శిఖర్ ధావన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ పై వెయ్యి రన్స్ కొట్టిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
చెన్నైతో ఇటీవలే ముగిసిన మ్యాచులో 88 పరుగులు చేసిన ధావన్.. మొత్తంగా ఆ జట్టుపై 1,029 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇదొక రికార్డు. కాగా.. రోహిత్, ధావన్ లు ఐపీఎల్ లో ఒక జట్టు మీదే వెయ్యి పరుగులు పూర్తి చేయగా.. వార్నర్ మాత్రం పంజాబ్ కింగ్స్ తో పాటు కోల్కతా మీద కూడా ఈ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు 155 మ్యాచులాడిన వార్నర్.. 5,668 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ లీగ్ లో నాలుగు సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వార్నర్.. 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 219 పరుగులు చేయడం విశేషం.