ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచులు సెప్టెంబర్లోనే... ఆ మూడు దేశాల్లో నుంచి...
ఐపీఎల్ 2021 సీజన్కి మధ్యలో బ్రేకులు వేసింది కరోనా వైరస్. అయితే పాజిటివ్ కేసులు రావడంతో తాత్కాలికంగా మ్యాచులకు బ్రేకులు వేసిన బీసీసీఐ, త్వరలోనే లీగ్ పున: ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోందట.
వచ్చే నెలలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఈ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లే భారత జట్టు ఆటగాళ్లు, అక్కడే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడతారు.
ఆ తర్వాత బిజీ బిజీ షెడ్యూల్స్తో గడపబోతోంది టీమిండియా. దీంతో కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను తిరిగి సెప్టెంబర్ నెలలో ప్రారంభించే ఆలోచనలు చేస్తోందట బీసీసీఐ...
సెప్టెంబర్14న ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత వారం రోజుల బ్రేక్లో ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభించి... టీ20 వరల్డ్ కప్ సమయానికి ముగించేయాలని ఆలోచనలు చేస్తున్నారట అధికారులు...
ఈ ఏడాది అక్టోబర్లో ఐసీసీ టీ20 వరల్డ్కప్ జరగనుంది. కరోనా కారణంగా వరల్డ్కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకోవడంతో అవసరమైతే యూఏఈ వేదికగా ఈ టోర్నీని నిర్వహించాలని చూస్తోంది ఐసీసీ...
మిగిలినవి సగం మ్యాచులే కాబట్టి సెప్టెంబర్ మధ్యలో ప్రారంభించి, డబుల్ హెడ్డర్ మ్యాచులతో 15 రోజుల్లో సీజన్ను ముగించాలని ప్రయత్నిస్తోందట బీసీసీఐ.
ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచులను నిర్వహించేందుకు యూఏఈతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలను వేదికలుగా పరిశీలిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే 2020 సీజన్ను యూఏఈలో నిర్వహించి, సూపర్ సక్సెస్ అయ్యింది బీసీసీఐ. కాబట్టి మొదటి ప్రాధాన్యం దానికే దక్కనుంది.
అయితే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి యూఏఈ రావడం, క్వారంటైన్లో ఉండడం... ఆ తర్వాత ప్రాక్టీస్ చేసేందుకు ఆటగాళ్లకు తగినంత సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్లోనే మ్యాచులు నిర్వహిస్తే... ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు అధికారులు.
అలాగే సెప్టెంబర్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహిస్తే, ఆ సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాల ప్లేయర్లు అందుబాటులో ఉండడం చాలా కష్టమవుతుంది.
అదీకాకుండా ఐపీఎల్ మ్యాచులు ముగియగానే టీ20 వరల్డ్కప్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఐపీఎల్ ఆడి అలసిపోయినా, గాయపడినా ఆ ఎఫెక్ట్, ఆ తర్వాత జరిగే మెగా టోర్నీపై పడుతుందని భయపడవచ్చు మిగిలిన దేశాల క్రికెట్ బోర్డులు...
ఇలా ఎలా చూసుకున్నా ఐపీఎల్ 2021 సీజన్కి అనువైన సమయం దొరకబట్టడం అంత సులువైన విషయం కాదు. జరిగితే సెప్టెంబర్లోనే జరగాలి. లేదా ఈ ఏడాదికి ఇంతేనని సగంలోనే రద్దు చేయాల్సిన పరిస్థితుల్లో పడింది బీసీసీఐ.