ఐపీఎల్ వాయిదా పడదు, రేపటి నుంచి యథావిథిగా మ్యాచులు... ఆ జట్టుకి మాత్రం ప్రత్యేకంగా...
ఐపీఎల్ 2021 సీజన్పై కరోనా పంజా విసిరిన విషయం తెలిసిందే. కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్తో పాటు సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథ్, బస్ క్లీనర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఐపీఎల్ వాయిదా పడబోతున్నట్టు ప్రచారం జరిగింది.
ఐపీఎల్ 2021 సీజన్ను మధ్యలో నుంచి వాయిదా వేయబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది బీసీసీఐ. ఎట్టిపరిస్థితుల్లోనూ సీజన్ను విజయవంతంగా పూర్తిచేస్తామని చెప్పింది.
‘ఇక్కడిదాకా వచ్చాక వెనకడుగు వేసే ఆలోచన లేదు... ఇప్పటికే సగం సీజన్ను సక్సెస్ఫుల్గా పూర్తిచేశాం. ఇకపై కూడా మరింత కట్టుదిట్టంగా బయో బబుల్ ఏర్పాటుచేసి మ్యాచులు నిర్వహిస్తాం...
కేకేఆర్ జట్టులో వచ్చిన పాజిటివ్ కేసులు, బీసీసీఐకి మరింత పని పెట్టాయి. ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకుని, సీజన్ను పూర్తిచేయాలని భావిస్తున్నాం.
ఓ ప్లేయర్ (వరుణ్ చక్రవర్తి) స్కానింగ్ కోసం బయో బబుల్ దాటి బయటికి వెళ్లడం వల్ల కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. కాబట్టి ఇది బయో బబుల్ అవతల జరిగింది.
ఇప్పటిదాకా అందరూ బయో బబుల్ ప్రోటోకాల్ను పక్కగా అమలు చేశారు. ఇకపై దీన్ని మరింత పటిష్టంగా చేయబోతున్నాం....
ప్రతీ జట్టుతో పాటు నలుగురు బీసీసీఐ సిబ్బంది వెంటే ఉంటారు. ఆటగాళ్ల కదలికలను వీళ్లు గమనిస్తూ ఉంటారు. ఎవరూ ప్రోటోకాల్ను తప్పినా, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది...
ప్రస్తుతానికి పాజిటివ్గా వచ్చిన ఇద్దరు ప్లేయర్లను ఐసోలేషన్లో ఉంచి, చికిత్స ఇప్పిస్తున్నాం. అలాగే ముందు జాగ్రత్త చర్యగా కోల్కత్తా నైట్రైడర్స్ జట్టును నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతాం.
వీరికి రోజూ టెస్టులు చేస్తాం. అందరూ నెగిటివ్గా వచ్చిన తర్వాతే ఆ జట్టు మ్యాచులు రీషెడ్యూల్ చేస్తాం...’ అంటూ తెలిపారు బీసీసీఐ అధికారి.
భారత క్రికెట్ బోర్డు ఇచ్చిన వివరణతో ఐపీఎల్ మ్యాచులపై క్లారిటీ వచ్చింది. కరోనా కారణంగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన నేటి మ్యాచ్ వాయిదా పడినా, రేపటి నుంచి మ్యాచులు యథావిథిగా జరగబోతున్నాయి.
రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలబడబోతోంది సన్రైజర్స్ హైదరాబాద్. ఇప్పటికే 7 మ్యాచుల్లో ఆరు మ్యాచులు ఓడిన హైదరాబాద్, ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.