IPL2021: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నా రక్తం, నా కుటుంబం... డేవిడ్ వార్నర్ ఎమోషనల్ రిప్లై...
ఐపీఎల్ ఎంతో మంది స్టార్లను తయారుచేసింది. అయితే ఓ ఫ్రాంఛైజీతో ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నవాళ్లు మాత్రం కొందరే. అలాంటి వారిలో డేవిడ్ వార్నర్ అందరికంటే ముందుంటాడు. వార్నర్ మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తారు...
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం ఎంతో చేసిన డేవిడ్ వార్నర్ను ఘోరాతిఘోరంగా అవమానించింది టీమ్ మేనేజ్మెంట్. ఐదు సీజన్లలో మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచి, ప్రతీసారీ టీమ్లో హైయెస్ట్ స్కోరర్గా ఉంటూ వస్తున్న డేవిడ్ వార్నర్ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది...
కెప్టెన్సీ పోయినా ఆటగాడిగా అయినా జట్టులో చోటు ఉంటుందనుకుంటే, అది కూడా దక్కలేదు. కనీసం స్టేడియంలో జట్టుతో కలిసి మ్యాచ్ చూద్దామంటే అందుకు కూడా అనుమతించలేదు...
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్, అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో డేవిడ్ వార్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ పోస్టుపై ఏడుస్తున్నట్టుగా ఎమోషనల్ ఎమోజీలను పోస్టు చేశాడు...
ఓ వార్నర్ అభిమాని... ‘దయచేసి ఎస్ఆర్హెచ్ గురించి పట్టించుకోవడం ఆపేయండి... టీ20 వరల్డ్కప్పైన ఫోకస్ పెట్టడం. సన్రైజర్స్ హైదరాబాద్ నీకు దక్కాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా అవమానిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు...
దానికి డేవిడ్ వార్నర్... ‘ఈ జట్టు నా రక్తం, నా కుటుంబం... చాలా ఏళ్లుగా ఈ టీమ్ కోసం నా చెమటను ధార పోశాను... నేను అంత తేలిగ్గా దాన్ని వదులుకోలేను...’ అంటూ సమాధానం ఇచ్చాడు...
సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్, ఓ లెజెండరీ క్రికెటర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, కనీసం టీమ్ బస్సులో కూడా ఎక్కకుండా అవమానిస్తున్నా, డేవిడ్ వార్నర్ మాత్రం ఆ జట్టుతో తనకున్న అనుబంధాన్ని ఎంతో హుందాగా చెప్పుకొచ్చాడు..
సన్రైజర్స్ హైదరాబాద్ కోసం ఎంతో చేసిన డేవిడ్ వార్నర్ను ఘోరంగా అవమానిస్తోంది టీమ్ మేనేజ్మెంట్. సీజన్ ఫస్టాఫ్లో మనీశ్ పాండేను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని వార్నర్ చేసిన కామెంట్లను సీరియస్గా తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్, అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే...
ఆ తర్వాత జట్టులో నుంచి తీసేసిన సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, ఇప్పుడు డేవిడ్ వార్నర్ను మ్యాచ్ చూడడానికి కూడా స్టేడియానికి రానివ్వడం లేదట... రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో స్టేడియంలో కనిపించిన డేవిడ్ వార్నర్, ఫ్యాన్స్ ఫీల్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కి రావాలని భావించాడు...
అయితే సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతన్ని టీమ్ బస్సులో ఎక్కడానికి అనుమతించలేదు... దీనికి కారణం వార్నర్పై సోషల్ మీడియాలో వస్తున్న బీభత్సమైన సానుభూతి పవనాలే...
సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల్లో వార్నర్ డగౌట్లో కనిపిస్తే, అతని మీదే ఫోకస్ అంతా ఉంటుంది. జట్టును నడిపించిన కెప్టెన్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటూ ట్రోల్స్ మొదలవుతాయి...
ఫస్టాఫ్లో డేవిడ్ వార్నర్ లేకుండా ఆడిన మొదటి మ్యాచ్లో రాజస్థాన్ చేతుల్లో 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది సన్రైజర్స్. ఆ సమయంలో ‘బ్రింగ్ బ్యాక్ వార్నర్’, ‘నో వార్నర్, నో ఎస్ఆర్హెచ్’ అంటూ హ్యాష్ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి..
వీటిని ఎదుర్కోవడం ఇష్టం లేని సన్రైజర్స్ హైదరాబాద్, స్టేడియంలో మ్యాచ్ చూడడానికి కూడా డేవిడ్ వార్నర్ను అనుమతించలేదని సమాచారం... ఇది తెలిసిన వార్నర్ భాయ్ ఫ్యాన్స్, సన్రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...
ఐపీఎల్ వేలంలో టీ, కాఫీలు, తాగుతూ, స్నాక్స్ తింటూ కాలక్షేపం చేయకుండా మంచి ప్లేయర్లను కొనుగోలు చేసి ఉంటే, జట్టు పరిస్థితి ఇలా తయారయ్యేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు...