మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేయబోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు... మైక్ హుస్సీ మాత్రం ఇక్కడే...
ఐపీఎల్ 2021 సీజన్కి అర్ధాంతరంగా బ్రేకులు పడడంతో లీగ్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్ల పరిస్థితి గందరగోళంలో పడింది. భారత్లో సెకండ్ వేవ్ కారణంగా ఇక్కడి నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించింది ఆస్ట్రేలియా...
ఐపీఎల్ మ్యాచులు కూడా లేకపోవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇక్కడి నుంచి నేరుగా మాల్దీవులకు చేరుకోబోతున్నారు. క్రికెటర్లతో పాటు కోచ్లు, కామెంటేటర్లు, ఇతర సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసింది బీసీసీఐ.
ఆస్ట్రేలియా క్రికెటర్లు వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రభుత్వాన్ని కోరినా, అక్కడి ప్రభుత్వం అనుమతికి నిరాకరించింది. ప్రభుత్వాన్ని మీరి దేశంలో అడుగుపెడితే 5 ఏళ్ల కారాగార శిక్షవిధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభించే వరకూ ఆస్ట్రేలియా క్రికెటర్లు మాల్దీవుల్లో గడపబోతున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హుస్సీ మాత్రం ఇక్కడ ఉండబోతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. మైక్ హుస్సీకి కరోనా నెగిటివ్గా నిర్థారణ అయినా, కోవిద్ లక్షణాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా ఇక్కడి ఉంచి చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది సీఎస్కే...
ఢిల్లీ క్యాపిటల్స్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్, ఆర్సీబీలో గ్లెన్ మ్యాక్స్వెల్, డాన్ క్రిస్టియన్, ముంబైలో క్రిస్ లీన్, కేకేఆర్లో ప్యాట్ కమ్మిన్స్,... ఇలా మొత్తంగా 14 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొన్నారు...
సీజన్ ఆరంభమైన తర్వాత ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్... భయంతో స్వదేశానికి బయలుదేరారు. వీరిలో ఆండ్రూ టై దోహా ద్వారా స్వదేశం చేరగా ఆడమ్ జంపా, రిచర్డ్సన్ మూడు రోజులు ముంబై ఎయిర్పోర్టులో చిక్కుకుని అతి కష్టమ్మీద స్వదేశం చేరారు...
ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇండియాకి వచ్చిన విదేశీ క్రికెటర్లను క్షేమంగా స్వదేశం చేర్చే బాధ్యత తీసుకున్న భారత క్రికెట్ బోర్డు, మాల్దీవుల్లో వారికి అవసరమైన సదుపాయాలు సమకూర్చుతోంది...