IPL 2020 Final: రోహిత్ సెంటిమెంట్, ఢిల్లీ క్యాపిటల్స్కి కలిసొస్తుందా... ఫైనల్లో బద్ధలయ్యే రికార్డులివే!
IPL 2020 సీజన్... బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎన్నో ఇబ్బందులకు ఎదురొడ్డి ఛాలెంజింగ్గా నిర్వహించిన మెగా టోర్నీ. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో ఈ మెగా క్రికెట్ సమరానికి తెరపడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్కి ముందు సెంటిమెంట్స్, రికార్డుల ఆధారంగా టైటిల్ విజేత ఎవరు అవుతారో అంచనా వేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
రోహిత్ శర్మ ఇప్పటిదాకా ఐదుసార్లు ఫైనల్ మ్యాచులు ఆడాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆల్రౌండర్గా బరిలో దిగిన రోహిత్ శర్మ, 2013, 2015, 2017, 2019 సీజన్లలో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా వ్యవహారించాడు.
రోహిత్ శర్మ ఆడిన ప్రతీ ఫైనల్ మ్యాచ్లోనూ తన జట్టే విజయం సాధించింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ ఛాంపియన్గా నిలువగా, కెప్టెన్గా నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్కి అందించాడు రోహిత్ శర్మ.
మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టి నాలుగుసార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ... ఈసారి ఛాంపియన్షిప్ గెలిస్తే ఐదో టైటిల్ గెలిచిన కెప్టెన్గా అందనంత ఎత్తులో నిలుస్తాడు.
రోహిత్ శర్మ ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీజన్లలన్నీ బేసి సంఖ్యతో ముగిసేవే. 2009, 13, 2015, 2017, 2019 సీజన్లలో టైటిల్స్ గెలిచాడు రోహిత్ శర్మ. ఈసారి టైటిల్ గెలిస్తే మొట్టమొదటిసారి సరిసంఖ్యతో ముగిసే ఏడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలిపినవాడు అవుతాడు రోహిత్.
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న శిఖర్ ధావన్, ఐపీఎల్ కెరీర్లో నాలుగోసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.
మొదటిసారి ముంబై ఇండియన్స్ తరుపున 2010లో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ‘గబ్బర్’, 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఫైనల్ ఆడి టైటిల్ సాధించాడు. 2018లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ధావన్, టైటిల్ గెలవలేకపోయాడు.
ఈసారి తన మొదటి ఫైనల్ టీమ్ ముంబైకి ప్రత్యర్థిగా బరిలో దిగుతున్నాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్ మాత్రమే మూడు భిన్నమైన జట్లకు ఫైనల్ మ్యాచ్ ఆడారు.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ నేడు తన 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇంతకుముందు 200 మ్యాచులు ఆడిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఈ ఫీట్ సాధించబోయే క్రికెటర్ రోహిత్ శర్మనే. ధోనీ 200వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది.
రోహిత్ శర్మ మరో 8 పరుగులు చేస్తే ముంబై ఇండియన్స్ తరుపున 4000 పరుగులు పూర్తిచేసుకుంటాడు. ఐపీఎల్ కెరీర్లో 5162 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఢిల్లీ ప్లేయర్ శిఖర్ ధావన్ ఫైనల్ మ్యాచ్లో 68 పరుగులు చేస్తే, సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కెఎల్ రాహుల్ని వెనక్కినెట్టి ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడు. కెఎల్ రాహుల్ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కిరన్ పోలార్డ్ ఈ మ్యాచ్లు రెండు సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు. ఇంతకుముందు గేల్, ఏబీడీ, ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.