ఫ్యాన్స్కి గుడ్న్యూస్ చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ... పంజాబ్తో మ్యాచ్ ముందు క్లారిటీ...
IPL 2020 సీజన్లో గ్రూప్ దశకే పరిమితమైంది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఆడబోయే మ్యాచ్, 2020 సీజన్లో చెన్నైకి ఆఖరి మ్యాచ్ కానుంది. దీంతో తమ ఫేవరెట్ క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీని వచ్చే ఏడాది దాకా మిస్ కాబోతున్నారు ‘తలైవా’ ఫ్యాన్స్. ధోనీ సీఎస్కేని వీడి, మరో జట్టులో చేరబోతున్నాడనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ కలవరం మొదలైంది. అయితే సీజన్ 2020 ఆఖరి మ్యాచ్లో అభిమానులకి గుడ్న్యూస్ చెప్పాడు ధోనీ.
2020 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే... వచ్చే ఏడాది తాను చెన్నైని వీడి వేలంలో పాల్గొనాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...
ప్రస్తుతం చెన్నై సారథిగా యేటా దాదాపు రూ.17 కోట్ల రూపాయాలు ఆర్జిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ మొత్తం తనకు తక్కువని ఫీల్ అయిన ధోనీ, వేలంలో పాల్గొని భారీ ధరకు వేరే జట్టులోకి వెళ్లాలని భావించాడు.
దీంతో మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్లో ఈ సీజన్ ఆఖరిదని భావించారంతా. అయితే నేటి మ్యాచ్ టాస్ సమయంలో ఇదే విషయమై మహేంద్ర సింగ్ ధోనీకి ప్రశ్న వచ్చింది...
ఎల్లో జెర్సీలో ఇదే చివరి మ్యాచ్ అనుకోవచ్చా? అని జనాల సందేహాన్ని అడిగాడు ఓ మాజీ క్రికెటర్. దీనికి సమాధానంగా ‘కచ్ఛితంగా కాదు... ఎల్లో జెర్సీలో మరిన్ని మ్యాచులు ఆడతానని అనుకుంటున్నాను’ అని అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు ధోనీ.
చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా 11 సీజన్లలో జట్టును నడిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇన్నేళ్లుగా ఓ జట్టుకి కెప్టెన్గా వ్యవహారించిన ఏకైక సారథి ధోనీయే...
మిగిలిన జట్లన్నీ కెప్టెన్లని మార్చినా, సీఎస్కే మాత్రం ధోనీపై నమ్మకంతో అతన్నే కెప్టెన్గా కొనసాగించింది. సీఎస్కేకి భారీ ఫాలోయింగ్ రావడానికి ధోనీ కూడా ఓ కారణం.
ఐపీఎల్లో 204 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... చెన్నై సూపర్ కింగ్స్కి మూడు సార్లు టైటిల్ అందించారు. 10 సార్లు ఫ్లేఆఫ్కి అర్హత సాధించిన సీఎస్కే, 8 సార్లు ఫైనల్ చేరుకుంది.
లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తూ 4632 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 23 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో 216 సిక్సర్లు, 313 ఫోర్లు బాదాడు.
ఈ సీజన్లో తొలిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్... మొట్టమొదటిసారి ప్లేఆఫ్కి అర్హత సాధించలేకపోయింది...
చెన్నై ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ధోనీ ఎల్లో జెర్సీలోనే కొనసాగతానని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు...
అయితే ఈ సీజన్లో ధోనీ ప్రదర్శన ఘోరంగా ఉండడంతో వేలం పాటలో తనకి పెద్దగా ధర దొరకపోవచ్చననే భయంతోనే చెన్నైసూపర్ కింగ్స్లోనే కొనసాగాలని భావించి ఉంటాడని అంటున్నారు మాహీ యాంటీ ఫ్యాన్స్...
అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో జరిగే ఐపీఎల్లో పాల్గొనబోతున్నాడు.