INDvsSA 3rd Test: విరాట్ కోహ్లీ సెంచరీ మిస్... మొదటి రోజే టీమిండియా ఆలౌట్...
India vs South Africa 3rd Test: 79 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ... తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకి టీమిండియా ఆలౌట్...
కేప్ టౌన్ టెస్టులో తొలిరోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూసిన విరాట్ కోహ్లీ 71వ సెంచరీ... వచ్చేలా కనిపించినా అవతలి ఎండ్లో వరుసగా వికెట్లు పడడంతో ఒత్తిడికి గురైన భారత టెస్టు సారథి... మూడంకెల స్కోరుని అందుకోలేకపోయాడు...
33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎంతో ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించి, ఓ ఎండ్లో వరుస వికెట్లు పడుతున్నా సహనంతో ఆడి భారత స్కోరు 200+ దాటడంలో కీలక పాత్ర పోషించాడు...
ఓ ఎండ్లో భారత సారథి విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయినా అతనికి అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. 159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, టెస్టు కెరీర్లో రెండో అతి నెమ్మదైన అర్ధశతకం నమోదు చేశాడు...
అవతలి ఎండ్లో వరుస వికెట్లు పడడంతో సింగిల్స్ తీయలేక, నాన్స్ట్రైయికర్లకు స్ట్రైయిక్ ఇవ్వలేక ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ... 201 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్తో 79 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
70వ సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి శుభారంభం దక్కలేదు.
మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ 35 బంతుల్లో ఓ ఫోర్తో 12 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
డాన్నే ఓలీవర్, కెఎల్ రాహుల్ వికెట్ తీయగా, కగిసో రబాడాకి మయాంక్ అగర్వాల్ వికెట్ దక్కింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కలిసి మూడో వికెట్కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు.
పూజారా తన బ్యాటింగ్ స్టైల్కి విరుద్ధంగా దూకుడుగా బ్యాటింగ్ చేయగా, విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు..
77 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్లో వికెట్ కీపర్ వెరెన్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన అజింకా రహానే, కగిసో రబాడా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు...
116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రబాడా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, 2018 తర్వాత విదేశీ గడ్డపై తొలి సిక్సర్ నమోదుచేశాడు. 2020 జనవరి నుంచి టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఓవరాల్గా ఇది రెండో సిక్సర్ మాత్రమే...
అజింకా రహానే అవుటైన తర్వాత రిషబ్ పంత్తో కలిసి ఐదో వికెట్కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విరాట్ కోహ్లీ. 50 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన రిషబ్ పంత్, మార్కో జాన్సెన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 10 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి జాన్సెన్ బౌలింగ్లోనే అవుట్ కావడంతో 175 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...
ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 9 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్తో 12 పరుగులు చేసి అవుట్ కాగా, జస్ప్రిత్ బుమ్రా 9 బంతులాడి డకౌట్ అయ్యాడు...
కెప్టెన్గా సౌతాఫ్రికాలో మూడోసారి 50+ నమోదు చేసిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికాలో టీమిండియా సారథిగా 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ 911, ఎమ్మెస్ ధోనీ 592 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అత్యధిక దేశాలపై 1000 పరుగులు చేసిన కెప్టెన్గా రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 6 దేశాలపై 1000 పరుగులు చేసి టాప్లో ఉన్నాడు...
కెరీర్లో 99వ టెస్టు మ్యాచ్, 499వ అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ 39 స్ట్రైయిక్ రేటుతో 79 పరుగులు చేసి 9వ వికెట్గా పెవిలియన్ చేరడం విశేషం.
టెస్టుల్లో 200+ బంతులు ఎదుర్కోవడం కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇది 15వ సారి. అలెన్ బోర్డర్ (19 సార్లు), గ్రేమ్ స్మిత్, మిక్ అర్థెటన్ (17 సార్లు) కెప్టెన్గా ఈ ఫీట్ సాధించి విరాట్ కంటే ముందున్నారు...