ఓపెనర్లు సూపర్ హిట్.. టీమిండియాకు బ్యాక్ టు బ్యాక్ సిరీస్ లు.. కొనసాగితే పండుగే...!
INDvsNZ: న్యూజిలాండ్ తో రాయ్పూర్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో భారత జట్ట 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో పాటు గడిచిన ఐదు మ్యాచ్ లలోనూ భారత ఓపెనింగ్ జోడీ సూపర్ హిట్ అయింది.
ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా రెండేండ్లు ఐసీసీ ట్రోఫీలలో దారుణ వైఫల్యాలతో పరువు పోయిన భారత జట్టు.. సొంతగడ్డపై మాత్రం వరల్డ్ కప్ ను ఒడిసిపట్టాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే శ్రీలంకతో టీ20 సిరీస్ కు ముందే ప్రణాళికలు సిద్ధం చేసిన భారత క్రికెట్ బోర్డు.. వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నది.
ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది టీమిండియా ఓపెనింగ్ జోడీ. సచిన్ - గంగూలీ, సచిన్ - సెహ్వాగ్ తర్వాత టీమిండియాకు దొరికిన ఓపెనింగ్ జోడీ రోహిత్ - ధావన్. గత దశాబ్దంలో ఈ ఇద్దరూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే కొంతకాలంగా విరామం లేని క్రికెట్, వయసు భారం, ఫామ్ లేమి.. ఇలా కారణాలేమైతేనేమి ధావన్ జట్టుకు క్రమంగా దూరమవుతున్నాడు.
నిన్నా మొన్నటిదాకా వన్డేలకు మాత్రమే పరిమితమైన ధావన్.. గతేడాది బంగ్లాదేశ్ టూర్ తర్వాత కనుమరుగయ్యాడు. అతడు వన్డే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో కూడా లేడని వార్తలు వెలువడుతున్నాయి. మరి ఈ దశలో భారత్ కు రోహిత్ తో పాటు ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసే నిఖార్సైన ఓపెనర్ ఎవరు..? అన్న ప్రశ్న గత కొంతకాలంగా టీమిండియా ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేసింది.
మధ్యలో టీమిండియా కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి ప్లేయర్లతో ప్రయోగాలు చేయించినా అవేమీ అంత సక్సెస్ కాలేదు. టీ20లలో మెరుపులు మెరిపించి గతేడాది వన్డేలలో కూడా డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ కూడా పోటీలోకి వచ్చాడు. అయితే టీమిండియా మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నది.
ఇషాన్ ను కాదని.. పంజాబ్ ఆటగాడు శుభ్మన్ గిల్ ను రోహిత్ కు జోడీగా పంపింది. శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు రోహిత్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై ఎన్నో విమర్శలు. అసలు డబుల్ సెంచరీ చేసినోడిని తీసేసి గిల్ ను ఓపెనర్ గా పంపడమేందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇది కూడా అట్టర్ ఫ్లాఫ్ అవుతుందన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
కానీ టీమ్ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని గిల్ వమ్ము చేయలేదు. కెప్టెన్ అండ ఉండగా సొంతగడ్డపై చెలరేగుతున్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ సారథికే పోటీనిస్తున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా సెంచరీ చేసిన అతడు.. తర్వాత న్యూజిలాండ్ తో డబుల్ సెంచరీ కూడా బాదాడు.
శ్రీలంకతో సిరీస్ నుంచి రోహిత్ - గిల్ ల భాగస్వామ్యాలు చూస్తేనే తెలుస్తున్నది ఈ జోడీ ఎంత సూపర్ హిట్ అనేది. లంకతో తొలి మ్యాచ్ లో ఇద్దరూ కలిసి 143 పరుగులు జోడించారు. రెండో వన్డేలో 33 రన్స్ వచ్చాయి. మూడో వన్డేలో 95 రన్స్ పార్ట్నర్ షిప్ నమోదైంది.
ఇక కివీస్ తో సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఇద్దరు కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక నేటి (శనివారం) మ్యాచ్ లో కూడా తొలి వికెట్ భాగస్వామ్యం 72 రన్స్. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో తర్వాత వచ్చే బ్యాటర్లకూ పని సులువవుతున్నది. అందుకే గడిచిన ఐదు మ్యాచ్ లలో స్కోర్లే నిదర్శనం.
లంకతో తొలి మ్యాచ్ లో భారత్ 373 పరుగులు చేసింది. తర్వాత వరుసగా 219 (చేజింగ్), 390, 349 రన్స్ సాధించింది. నేటి మ్యాచ్ లో 108 పరుగులను అలవోకగా ఛేదించింది. రోహిత్ - గిల్ జోడీ ఇలాగే నిలకడగా ఆడితే వన్డే వరల్డ్ కప్ లో అది భారత్ కు మేలు చేసేదే. అయితే ఈ ఇద్దరూ ఇదే ఫామ్ ను కొనసాగిస్తారా..? లేదా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న...