కోహ్లీ కోసమే ఇలాంటి పిచ్ తయారుచేశారా... తొలి టెస్టు పిచ్పై విమర్శలు...
ఆస్ట్రేలియా విజయం తర్వాత భారత జట్టు ప్రదర్శనపై బీభత్సమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇంగ్లాండ్ జట్టు, ఇండియాలో ముప్పుతిప్పలు పడడం ఖాయమని అనుకున్నారంతా. తొలి టెస్టు తొలి రోజులోనే ఆ అంచనాలన్నీ పటాపంచలు అయిపోయాయి. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ముఖ్యంగా పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం లభించడం లేదు.
మంచి ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్తో 150+ స్కోరు చేసి, డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. 13 టెస్టుల తర్వాత ఇండియాలో ఇండియాపై మొదటి వికెట్కి 50+ భాగస్వామ్యం నమోదుకాగా, మూడో వికెట్కి 200 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశాడు సిబ్లీ, జో రూట్... బెన్ స్టోక్స్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు...
ఈ పిచ్పై ఘాటైన విమర్శలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్. ‘థ్యాంక్యూ ఇండియా... చెన్నై గ్రౌండ్ మ్యాన్... మంచి రోడ్డును నిర్మించారు’ అంటూ ట్వీట్ చేశాడు మైఖేల్ వాగన్. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం ఏ మాత్రం కష్టంగా లేదని, ఓటమి భయంతోనే ఇలాంటి పిచ్ తయారుచేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి...
టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే, విరాట్ కోహ్లీ, పూజారా బ్యాటింగ్ చేసి... భారీ స్కోర్లు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి నిస్తేతేజమైన పిచ్ తయారుచేసి ఉంటారని, అయితే టాస్ పర్యాటక జట్టు గెలవడంతో సీన్ మారిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సెంచరీ చేసిన జో రూట్ అయితే.. మూడో రోజు వరకూ బ్యాటింగ్ కొనసాగించి... భారత్ ముందు 600- 700 స్కోరు ఉంచుతామని ఛాలెంజ్ కూడా చేసేశాడు. ఇలాంటి పిచ్పై భారత జట్టు, ఇంగ్లాండ్ను ఆలౌట్ చేయడం ఇప్పుడు చాలా పెద్ద సవాల్. ఇప్పటికే 110 ఓవర్లు బ్యాటింగ్ చేసినా 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లాండ్... ఈరోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే టీమిండియా ముందు భారీ స్కోరు ఉంచుతుంది.
భారత్ కంటే ఎంతో బలహీనమైన శ్రీలంక జట్టు, ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టింది. ఒక్క కెప్టెన్ జో రూట్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. అయితే తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బౌలింగ్ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది ఇంగ్లాండ్ టీమ్...