కోహ్లీకి రూల్స్ వర్తించవా... విరాట్ పద్ధతి మార్చుకుంటే బెటర్... భారత కెప్టెన్పై వీరూ ఫైర్...
భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ కలిసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరి రూట్ మారిపోయింది. కోహ్లీని ఇన్నాళ్లు గంభీర్ విమర్శిస్తూ వస్తే, అతన్ని సపోర్టు చేస్తూ వచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కోహ్లీకి హ్యాట్సాఫ్ అంటూ గంభీర్ కామెంట్ చేస్తే... కోహ్లీ కెప్టెన్సీపై ఫైర్ అయ్యాడు వీరేంద్ర సెహ్వాగ్.
తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. మొదటి మ్యాచ్లో ఆకట్టుకున్న మహమ్మద్ షమీతో పాటు మొదటి వికెట్కి రాణించిన రెండు మ్యాచుల్లోనూ 50+ భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్ అగర్వాల్కి జట్టులో చోటు దక్కలేదు.
మొదటి టీ20లో అయితే జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్కి అవకాశం ఇవ్వలేదు కోహ్లీ. జడేజా గాయపడడంతో లక్కీగా జట్టులో వచ్చిన చాహాల్ మూడు వికెట్లు తీయడంతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. లేదంటే పరిస్థితి వేరేగా ఉండేది.
భారత జట్టులో మార్పులు చేస్తున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేశాడు భారత మాజీ ఓపెనర్, వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్...
‘శ్రేయాస్ అయ్యర్ టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. చివరి టీ20 సిరీస్లో కూడా అతను బాగా ఆడాడు. న్యూజిలాండ్ టూర్లో కూడా చక్కగా బ్యాటింగ్ చేశాడు. మరి అతన్ని ఎందుకు జట్టు నుంచి తొలగించారు...
తనకి జట్టులో ఎందుకు చోటు దక్కలేదో అడిగే ధైర్యం శ్రేయాస్ అయ్యర్కి లేదు. ఇంకెవరూ కోహ్లీని అడగలేరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్... ’ అంటూ విమర్శించాడు సెహ్వాగ్.
‘నెం. 4 స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చక్కగా రాణిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు సమస్యగా మారిన నెం. 4 ప్లేస్కి అయ్యర్ కరెక్టుగా సెట్ అయ్యాడు. మరి అతన్ని ఎందుకు పక్కనబెట్టారు...
వన్డేల్లో పెద్దగా రాణించలేదని శ్రేయాస్ అయ్యర్ని పక్కనబెట్టి ఉండవచ్చు. కానీ టీ20 ఫార్మాట్ వేరు... ఈ విషయం విరాట్ కోహ్లీకి కూడా తెలుసు...
టీమిండియాలో ఉన్న అందరికీ రూల్స్ వర్తిస్తాయి. తనకు నచ్చినట్టుగా బ్యాటింగ్ ఆర్డర్ని మారిస్తే జట్టు పర్ఫామెన్స్ దెబ్బ తింటుంది.
ఆటగాళ్లపై ఇష్టం వచ్చినట్టు వేటు వేయకూడదు. ఫామ్లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంలో కోహ్లీ అంతర్యం ఏమిటి? విరాట్ కోహ్లీ తన పద్ధతి మార్చుకుంటే బెటర్’ అంటూ కోహ్లీ కెప్టెన్సీని విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి మద్దతుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియాపై రెండు విజయాల తర్వాత కూడా అతన్ని ట్రోల్ చేయడం విశేషం.
‘విరాట్ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్’ అని గౌతమ్ గంభీర్ కామెంట్ చేయగా... ‘రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ కాదు, కేవలం బెస్ట్ టీమ్కి మాత్రమే కెప్టెన్’ అంటూ వీరూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.