ఆ గాయమే ఓడించింది... డాక్టర్ను తప్పుపట్టలేం... ఓటమిపై ఆరోన్ ఫించ్...
INDvsAUS: మొదటి టీ20లో ఓటమిని ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. ఓడిపోవడం కంటే సబ్స్టిట్యూబ్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్... మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికవ్వడం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరింత బాధపెడుతోంది. మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని తెలిపాడు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.
‘జడేజా ఫిట్గా లేడని భారత జట్టు డాక్టర్ చెప్పాడు. మెడికల్ ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని మనం ఛాలెంజ్ చేయలేం... డెత్ ఓవర్లలో మేం ఎక్కువగా పరుగులు ఇచ్చింది...
లక్ష్యచేధనలో బౌండరీలు ఎక్కువగా కొట్టలేకపోయాం. ముఖ్యంగా ఆఖరి ఆరు ఓవర్లలో రావాల్సినన్ని పరుగులు రాలేదు.... ఓ రకంగా జడేజా గాయమే మమ్మల్ని ఓడించింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.
26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 35 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, సబ్సిట్యూట్గా వచ్చిన చాహాల్ బౌలింగ్లోనే అవుట్ అయిన విషయం తెలిసిందే.
ఫించ్తో పాటు స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్లను అవుట్ చేసిన యజ్వేంద్ర చాహాల్... 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కంకూషన్ సబ్స్టిట్యూట్గా వచ్చి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు.
‘చాహాల్ను ఆడించాలని మేం అనుకోలేదు. కంకూషన్ రిప్లేస్మెంట్ అనేది ఓ వింతైన విధానం. ఈరోజు అది బాగా వర్కవుట్ అయ్యింది... వాళ్లు కూడా తేలిగ్గా కొన్ని వికెట్లు ఇచ్చారు...
టీ20 క్రికెట్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం... చివరిదాకా విజయం కోసం కష్టపడాల్సిందే... హార్ధిక్ పట్టిన మొదటి క్యాచ్ గేమ్ ఛేంజర్ అయ్యింది’ అని చెప్పుకొచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
భారత జట్టు వరుసగా గత తొమ్మిది టీ20 మ్యాచుల్లో విజయాన్ని అందుకుంది. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది...
మనీశ్ పాండే ఆడిన గత 20 టీ20 మ్యాచుల్లోనూ భారత జట్టు ఓడిపోలేదు. మనీశ్ జట్టులో ఉన్న ప్రతీ మ్యాచ్లోనూ టీమిండియా గెలవడం ఓ రికార్డు...
జడేజా స్థానంలో చాహాల్ను ఆడించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఆస్ట్రేలియా... కొందరు ఆస్ట్రేలియన్లు కూడా దీన్ని తప్పుబడుతూ ట్రోల్స్ చేస్తున్నారు...
అయితే 2019 లార్డ్స్లో జరిగిన యాషెస్ సిరీస్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ హెల్మెట్కి బంతి బలంగా తగిలింది. గాయంతో పెవిలియన్ చేరిన స్మిత్, కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి బ్యాటింగ్ చేసి 92 పరుగులకి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో అతని స్థానంలో లబుషేన్ను ఆడించింది ఆస్ట్రేలియా. అప్పుడు ఆస్ట్రేలియా చేసింది తప్పు కానిది, భారత జట్టు చేస్తే తప్పు ఎలా అయ్యిందని నిలదీస్తున్నారు టీమిండియా అభిమానులు.
రవీంద్ర జడేజాకి ఇంతకుముందు 2009లో ఇంగ్లాండ్పై 35 బంతుల్లో 25 పరుగులే అతని టీ20 బెస్ట్ స్కోరు. 11 ఏళ్ల తర్వాత ఈ స్కోరును అధిగమించి 44 పరుగులతో అదరగొట్టాడు జడ్డూ.
ఆడిన మొదటి వన్డే, టీ20 మ్యాచుల్లో రెండు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొమ్మిదో భారత బౌలర్గా నిలిచాడు నటరాజన్. ఇంతకుముందు జహీర్ ఖాన్, వినయ్ కుమార్, ఓజా, బరిందర్ స్రాన్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్ధిక్ పాండ్యా, నవ్దీప్ సైనీ ఈ రికార్డు సాధించారు.