మన క్రికెటర్లు చేసే ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసా... ధోనీ, చాహాల్, కెఎల్ రాహుల్, హర్భజన్ సింగ్...
భారత్లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ హీరోలకు కూడా ఉండదు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... జనాల్లో వీరికి ఉండే క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్, ఐపీఎల్, మ్యాచ్ ఫీజు ఇలా వందల కోట్లు సంపాదిస్తున్నప్పటికీ, కొందరు క్రికెట్ క్రీజ్ బయట ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారనే విషయం తెలుసా...
క్రికెటర్గా ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజ్ వేరు. ఉద్యోగానికి భరోసా, ప్రతీ నెలా ఠించనుగా అకౌంట్లో పడే జీతం, సెలవులు,... ఇలా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండే సౌకర్యాలెన్నో. అందులో చాలామంది క్రికెటర్లు, కొన్ని కీలక శాఖల్లో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కపిల్దేవ్: క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత గోల్ఫ్ క్రీడలో అద్భుతంగా రాణిస్తున్నాడు మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్. భారత జట్టుకి ఆయన చేసిన సేవలు మెచ్చి, ప్రభుత్వం ఆయనకి ఆర్మీలో ఉన్నత పదవిని ఆఫర్ చేసింది.
2008లో భారత టెర్రిటోరియల్ ఆర్మీలోకి ప్రవేశించిన కపిల్ దేవ్, లెఫ్టెనెంట్ కల్నల్ ర్యాంకును సాధించారు. కపిల్దేవ్ ఈ పదవి స్వీకరించడం వల్ల యువతకు బ్రాండ్ అంబాసిడర్గా మారతారని, యువకులు ఆర్మీలోకి ప్రవేశించడానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని వ్యాఖ్యానించారు అడిషినల్ డైరెక్టర్ ఆఫ్ టెర్రిటోరియల్ ఆర్మీ.
హర్భజన్ సింగ్: తన స్పిన్ బౌలింగ్తో బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టే ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్, భారత జట్టు తరుపున 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. కొంతకాలంగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న భజ్జీ, కామెంటేటర్గా కూడా సక్సెస్ అయ్యాడు.
భారత జట్టుకి ఆయన చేసిన సేవలు మెచ్చిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించింది.
జోగిందర్ శర్మ: 2007 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసి, అప్పటిదాకా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న పాక్ ప్లేయర్ మిస్బా వుల్ హక్ వికెట్ తీసి, టీమిండియాకి విజయాన్ని అందించిన బౌలర్ జోగిందర్ శర్మ. ఈ పర్ఫామెన్స్ తర్వాత టీమిండియాలో పెద్దగా కనిపించలేకపోయాడు జోగిందర్.
2007 టీ20 వరల్డ్కప్ విజయంలో కీలక పాత్ర పోషంచిన జోగిందర్ శర్మకు హర్యానా ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించి గౌరవించింది. మిగిలిన క్రికెటర్లలా కాకుండా తన వృత్తిని పూర్తి స్థాయిలో స్వీకరించి, పోలీస్గా సెటిల్ అయిపోయాడు జోగిందర్ శర్మ...
ఉమేశ్ యాదవ్: టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్, చిన్నతనంలో పోలీస్ కానిస్టేబుల్ కావాలని కలలు కన్నాడు. ఫిజికల్ పరీక్షల్లో నూటికి 90 మార్కులు సాధించిన ఉమేశ్ యాదవ్, రాత పరీక్షలో రెండు మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత చదువులో ఫెయిల్ అయి, ఆర్మీ, పోలీసు శాఖలో ఉద్యోగం దక్కించుకోలేకపోయాడు.
బౌలర్గా రాణించాలని ఫిక్స్ అయిన ఉమేశ్ యాదవ్, ఐపీఎల్లో అదరగొట్టి 2011లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చాడు. మంచి పేసర్గా గుర్తింపు తెచ్చుకున్న ఉమేశ్ యాదవ్ని 2017లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా - నాగ్పూర్ అసిస్టెంట్ మేనేజర్గా నియమించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
కెఎల్ రాహుల్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఆ స్థాయిలో రాణించగల భారత బ్యాట్స్మెన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు కెఎల్ రాహుల్. అన్ని ఫార్మాట్లలో అదరగొడుతూ భవిష్యత్ స్టార్గా వెలుగుతున్న లోకేశ్ రాహుల్ కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ: టీమిండియాకి రెండు వరల్డ్కప్లు అందించిన ఏకైక భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ. ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ట్రోఫీలు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ, వన్డేల్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తూ 10 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు.
భారత జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ఇచ్చింది భారత ఆర్మీ. పారాచూట్ రెజిమెంట్లో ఈ ర్యాంకు సాధించిన ధోనీ, ఆగ్రాలో పారా జంపింగ్లో రెండు వారాల ట్రైయినింగ్ కూడా తీసుకున్నాడు.
యజ్వేంద్ర చాహాల్: క్రికెటర్గానే కాకుండా చెస్ ప్లేయర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. బక్క పల్చని పర్సనాలిటీతో జట్టులో మహా తుంటరిగా గుర్తింపు తెచ్చుకున్న చాహాల్, 2016లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేశాడు.
క్రికెట్ ఫీల్డ్లో యజ్వేంద్ర చాహాల్ చేసిన సేవలను గుర్తించిన ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్, అతనికి ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించింది.
సచిన్ టెండూల్కర్: క్రికెట్ చరిత్రలో అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ కూడా అందుకున్నాడు.
క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆయనకి, గ్రూప్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. భారత విమానయాన శాఖ చరిత్రలోనే ఎలాంటి ఎవియేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎయిర్ఫోర్స్ శాఖలో గౌరవ పదవి స్వీకరించిన మొట్టమొదటి ప్లేయర్ సచిన్ టెండూల్కర్.