ఆస్ట్రేలియాకి పయనమైన రోహిత్ శర్మ... మూడో టెస్టు కోసం క్వారంటైన్ నుంచే...
భారత స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఆసీస్తో టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లాడు. ఐపీఎల్లో ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి, ఆ మ్యాచ్లో జరిగినంత హైడ్రామా నడిచింది. ఒకానొక దశలో రోహిత్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నట్టే అని వార్తలు వచ్చినా, ఎట్టకేలకు శర్మగారి అబ్బాయి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు...
అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడ్డాడు రోహిత్ శర్మ... ఈ సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు అవుతున్న రోహిత్ గాయం మిస్టరీ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు...
ఐపీఎల్లో గాయపడిన వృద్ధిమాన్ సాహా లాంటి క్రికెటర్లు కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం అటు నుంచి అటే... దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కితే, రోహిత్ శర్మ మాత్రం స్వదేశానికి తిరిగొచ్చాడు.
‘రోహిత్ మాతో ఎందుకు రాలేదో కూడా నాకు తెలీదు.. రోహిత్ శర్మ గాయం పెద్ద మిస్టరీగా మారింది...’ అంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి...
భారత ఫిజియో రోహిత్ శర్మకు మూడు వారాల విశ్రాంతి అవసరమని భావించడంతో మొదట ఆస్ట్రేలియా టూర్కి ‘హిట్ మ్యాన్’ పేరును అసలు లెక్కలోకి తీసుకోలేదు...
రోహిత్ శర్మ లేకుండా టీ20, వన్డే, టెస్టు సిరీస్లకు జట్లను ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇది జరిగిన తర్వాతి రోజే ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, అభిమానులకు షాక్ ఇచ్చాడు...
ఐపీఎల్ ఆడిన ప్లేయర్, దేశానికి ఆడలేడా? అంటూ గౌతమ్ గంభీర్ లాంటి వాళ్లు, బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించారు. దాంతో తాము చేసిన తప్పు తెలుసుకున్న సెలక్టర్లు, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కి మాత్రం రోహిత్ను ఎంపికచేశారు..
తనకి విరాట్ కోహ్లీతో ఎలాంటి విబేధాలు లేవని, కేవలం తన తండ్రి బాగోగులు చూసుకునేందుకు స్వదేశం వచ్చానని రోహిత్ శర్మ స్వయంగా క్లారిటీ ఇచ్చేదాకా, విరాట్పై విమర్శల వర్షం తగ్గలేదు...
తండ్రి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు రోహిత్ శర్మ. అయితే టెస్టు సిరీస్ ఆడాలనుకుంటే వెంటనే ఆస్ట్రేలియా వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశాడు కోచ్ రవిశాస్త్రి...
వెంటనే వెళ్లడం కుదరదని, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని ఫిజియో చెప్పడంతో ఈ ఇద్దరూ టెస్టు సిరీస్కి దూరమైనట్టు వార్తలు వచ్చాయి...
అయితే వీటిపై కూడా స్పందించిన బీసీసీఐ... ఇషాంత్ శర్మను టెస్టు సిరీస్ నుంచి తప్పించి, రోహిత్ శర్మను చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని నిర్ణయించుకుంది...
డిసెంబర్ 11న ఎన్సీఏలో మరోసారి రోహిత్ శర్మకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన టీమిండియా ఫిజియో... అతను క్లినికల్లీ ఫిట్గా ఉన్నాడని రిపోర్టు ఇచ్చింది...
అయితే ఆస్ట్రేలియాలో భారత జట్టుతో ఉన్న ఫిజియో, వైద్య బృందంతో అందుబాటులో ఉండి, 14 రోజుల క్వారంటైన్ పీరియడ్లో తన ఫిట్నెస్ నిరూపించుకుంటాడు రోహిత్ శర్మ.
నేడు (డిసెంబర్ 15న) ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు రోహిత్ శర్మ. వెళ్లిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకుని, క్వారంటైన్లో ఉండడం మొదలెడతాడు రోహిత్ శర్మ...
మరో వైపు పితృత్వ సెలవుల కింద భారత సారథి విరాట్ కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోనున్నాడు..