మహిళల వరల్డ్ కప్ 2025: అందరిచూపు ఈ ఐదుగురు భారత ప్లేయర్ల పైనే
India Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్కప్ 2025 కోసం భారత జట్టులో సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లకు చోటుదక్కింది. క్రాంతి గౌడ్ నుంచి అరుంధతి రెడ్డి వరకు జట్టులోని ఐదుగురు యంగ్ ప్లేయర్లపై అందరిచూపు ఉంది.

మహిళల వరల్డ్కప్ 2025 కోసం భారత జట్టు సిద్ధం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల వన్డే వరల్డ్కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది ప్లేయర్లతో భారత జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ భారత మహిళల జట్టును ముందుకు నడిపించనున్నారు.
ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. ఈసారి జట్టులో సీనియర్లతో పాటు పలువురు యంగ్ ప్లేయర్లకు చోటుదక్కింది. అయితే, వారిలో ఐదుగురు యంగ్ ప్లేయర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
KNOW
క్రాంతి గౌడ్
భారత బౌలింగ్ విభాగానికి కొత్త శక్తి క్రాంతి గౌడ్. మధ్యప్రదేశ్కు చెందిన క్రాంతి అద్భుతమైన బౌలింగ్ తో క్రికెట్ లో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఆమె మూడు మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టింది.
ఒక మ్యాచ్లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతోనే ఆమెకు వరల్డ్కప్ జట్టులో స్థానం లభించింది. రాబోయే ఐసీసీ టోర్నీలో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది.
ప్రతికా రావల్
భారత జట్టుకు కొత్త ఓపెనర్ దొరికారు. ఆమె ఢిల్లీకి చెందిన ప్రతికా రావల్. షఫాలీ వర్మ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. స్మృతి మంధానాతో కలిసి ప్రతికా ఓపెనింగ్ చేయనున్నారు.
ఇప్పటి వరకు ఆడిన 14 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆమె 703 పరుగులు సాధించారు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్కప్లో ఆమె ప్రదర్శన భారత్ కు కీలకం కానుంది.
అమంజోత్ కౌర్
పూజా వస్త్రాకర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మరో యంగ్ ప్లేయర్ అమంజోత్ కౌర్. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టే ఆల్రౌండర్. బ్యాట్తో పాటు బౌలింగ్లోనూ ఇప్పటికే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు.
ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆమె 13 వికెట్లు తీశారు, బ్యాటింగ్లో 63 పరుగులు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు మిస్సయ్యారు.
శ్రీ చరణి
21 ఏళ్ల శ్రీ చరణి స్పిన్నర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 10 వికెట్లు తీసి "ప్లేయర్ ఆఫ్ ద సిరీస్" గెలుచుకుంది.
వన్డేల్లో ఆమె ప్రదర్శన సాధారణంగా ఉన్నా, స్వదేశీ పిచ్లపై ఆమె స్పిన్ భారత జట్టుకు ప్రధాన బలంగా మారనుంది.
అరుంధతి రెడ్డి
ఫాస్ట్ బౌలర్గా అరుంధతి రెడ్డి కూడా ప్రపంచ కప్ భారత జట్టులో చోటుదక్కించుకున్నారు. ఇప్పటి వరకు 9 వన్డే మ్యాచ్లలో 11 వికెట్లు తీసింది. ముఖ్యంగా పవర్ప్లే, మిడిల్ ఓవర్లలో ఆమె పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి జట్లను కట్టడి చేయడంలో దిట్ట.
అలాగే, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ లో కూడా ప్రభావం చూపించగల ప్లేయర్. స్వదేశీ పిచ్ లపై ఆమె అనుభవం భారత జట్టుకు మరింత బలం అందించనుంది.
మొత్తంగా ఈ ఐదుగురు యంగ్ ప్లేయర్లు భారత జట్టుకు కీలకం కానున్నారు. క్రాంతి గౌడ్ బౌలింగ్లో, ప్రతికా రావల్ బ్యాటింగ్లో, అమంజోత్ కౌర్ ఆల్రౌండ్ ప్రదర్శనలో, శ్రీ చరణి స్పిన్లో, అరుంధతి రెడ్డి ఫాస్ట్ బౌలింగ్లో రాణిస్తే భారత్ ఈ సారి కప్పుకొట్టడం పక్కా అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.