భారత్ vs పాకిస్తాన్: ఆసియా కప్లో కొత్త కుర్రాళ్లు.. పాక్ కు పిచ్చెక్కాల్సిందే !
India vs Pakistan : ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14 ఆదివారం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ పోరులో చాలా మంది యువ ఆటగాళ్ళు తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్తో తొలిసారి ఆడనున్నారు.

భారత్ vs పాకిస్తాన్: ఆసియా కప్ షోడౌన్
ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ పోరు సెప్టెంబర్ 14 ఆదివారం జరగనుంది. 2012-13 నుండి ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో.. ఈ దాయాది దేశాలు ఇప్పుడు ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. దీనివల్ల చాలా మంది యువ భారతీయ క్రికెటర్లు పాకిస్తాన్తో ఆడే అనుభవాన్ని పొందలేకపోయారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఐదుగురు యంగ్ కుర్రాళ్లు పాక్ తో తొలి మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారు.
1. అభిషేక్ శర్మ
2024లో అరంగేట్రం చేసిన టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటతో తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. అయితే, ఇంకా అభిషేక్ శర్మ పాకిస్తాన్తో ఆడలేదు. అయినప్పటికీ, అతను ఇప్పటికే 18 T20 అంతర్జాతీయ మ్యాచ్లలో 565 పరుగులతో ఆకట్టుకున్నాడు.
2. సంజూ శాంసన్
భారత డైనమిక్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ సంజూ శాంసన్ ఇంకా పాకిస్తాన్తో ఆడలేదు. స్పిన్, పేస్ రెండింటినీ ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న అతను ఇప్పటికే 43 T20 అంతర్జాతీయ మ్యాచ్లలో 861 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ పై తొలి మ్యాచ్ లోనే అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
3. జితేష్ శర్మ
జితేష్ శర్మ ఆసియా కప్ 2025లో ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకుంటే, అది పాకిస్తాన్తో అతని తొలి మ్యాచ్ అవుతుంది. ఈ యువ భారతీయ బ్యాట్స్మన్ ఇప్పటివరకు 9 T20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి 100 పరుగులు చేశాడు.
4. తిలక్ వర్మ
2023లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఇంకా పాకిస్తాన్తో ఆడలేదు. 26 T20 అంతర్జాతీయ మ్యాచ్లలో, అతను 749 పరుగులు చేశాడు. ఆసియా కప్ పోరులో అవకాశం లభిస్తే, అతను సునామీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.
5. రింకూ సింగ్
పాకిస్తాన్తో జరిగే గ్రూప్ దశ పోరులో రింకూ సింగ్ ఆడితే, అది వారితో అతని తొలి మ్యాచ్ అవుతుంది. 2023లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటికే 33 T20 అంతర్జాతీయ మ్యాచ్లలో 546 పరుగులు చేశాడు. దేశవాళీ, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు.
శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్
టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఇంకా పాకిస్తాన్తో T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఆడలేదు, అయితే వారిద్దరూ వన్డేలలో ఇప్పటికే పాక్ తో మ్యాచ్ లను ఆడిన అనుభవం ఉంది.