Ind Vs Nz: విరాట్ కోహ్లీ వచ్చినా అతడిని కొనసాగించాలి.. అలాగైతేనే టీమిండియా కూర్పు సెట్ అవుద్ది : గంభీర్
Suryakumar Yadav: ఓపెనింగ్ గా రోహిత్, రాహుల్ అదరగొడుతుండగా అదే ఊపును కొనసాగించాలంటే విరాట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తేనే జట్టు బ్యాటింగ్ కూర్పు కుదురుతుందని, అది టీమిండియాకు లాభం చేకూరుస్తుందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
టీమిండియా సారథి విరాట్ కోహ్లి గైర్హాజరీలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా తొలి పోరులో రోహిత్ సేన శుభారంభం చేసిన విషయం విదితమే. నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడి భారత్ కు విజయాన్ని ఖాయం చేశారు.
వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన యాదవ్.. చూడచక్కనైన షాట్లతో అలరించాడు. అయితే ఈ సిరీస్ తర్వాత భారత సారథి విరాట్ కోహ్లి మళ్లీ టీ20 జట్టుతో చేరతాడు. అప్పుడు విరాట్ వన్ డౌన్ లో బ్యాటింగ్ రావలసి ఉంటుంది. యాదవ్ మళ్లీ నాలుగో నెంబర్ బ్యాటర్ గా వెళ్లాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించాడు. విరాట్ జట్టుతో చేరినా అతడు తన స్థానాన్ని త్యాగం చేయాలని సూచించాడు. ఓపెనింగ్ గా రోహిత్, రాహుల్ అదరగొడుతుండగా అదే ఊపును కొనసాగించడానికి యాదవ్ ను వన్ డౌన్ లో పంపడమే ఉత్తమమని వ్యాఖ్యానించాడు.
గౌతీ మాట్లాడుతూ.. ‘అతడి (సూర్యకుమార్) కి చాలా ఆప్షన్లు ఉన్నాయి. సూర్య స్పిన్ ఆడగలడు. ఫాస్ట్ బౌలింగ్ లో షాట్లు కొట్టగలడు. అతడో 360 డిగ్రీ ప్లేయర్. అలాంటి ఆటగాడికి బౌలింగ్ చేయడం బౌలర్లకు కష్టంతో కూడుకున్నదే. ఒకవేళ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో చేరినా అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావాలి.
అలా వస్తేనే భారత బ్యాటింగ్ కూర్పునకు మేలు జరుగుతుంది. ఓపెనర్లుగా వచ్చే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు ఎలాగూ వీర విహారం చేస్తారు. ఒకవేళ వాళ్లలో ఎవరైనా ఔటైనా ఆ విధ్వంసాన్ని కొనసాగించాలంటే వన్ డౌన్ లో యాదవ్ రావడమే ఉత్తమమని నేను భావిస్తున్నాను. విరాట్ నాలుగో స్థానంలో వస్తే బెటర్.
ఎందుకంటే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మాదిరి.. విరాట్ యాంకర్ రోల్ పోషించాలి. ఒకవేళ వికెట్లు త్వరత్వరగా పడ్డా మిడిలార్డర్ లో విరాట్ ఆడితే దానిని అడ్డుకోగల సమర్థుడు..’ అని చెప్పాడు.
ఇక ఐపీఎల్ లో తాను కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడినప్పుడు సూర్యకుమార్ ను బ్యాటింగ్ లో ముందుకు పంపించకపోవడాన్ని ఎప్పుడూ చింతిస్తానని గంభీర్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
‘యాదవ్ ను నేను మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపకపోవడంపై నేనెప్పుడూ చింతిస్తూ ఉంటాను. కానీ నాకు ఆప్షన్స్ లేవు. అప్పటికే యూసుఫ్ ఫఠాన్, మనీష్ పాండే వంటి వాళ్లు వన్ డౌన్ లో రావాల్సి ఉండేది. అందుకే నేను సూర్య ను ఫినిషర్ గా వాడుకోవాలని భావించేవాడిని.
అయితే ఐపీఎల్ లో ప్లేయర్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారడం సహజమే. కానీ సూర్యను కోల్పోవడం కేకేఆర్ కు పూడ్చుకోలేని లోటు..’ అని గంభీర్ గతంలో వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న సూర్యకుమార్.. ఆ జట్టు తరఫున వన్ డౌన్ లో వచ్చి దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో పెద్దగా రాణించలేకపోయినా గత రెండు సీజన్లలో మాత్రం రెచ్చిపోయి ఆడి భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు.