చెన్నైలో స్పిన్నర్ల విధ్వంసం.. తిలక్ వర్మ బ్యాటింగ్ బ్లాస్ట్ !
India vs England: భారత యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ 72* పరుగుల సూపర్ నాక్ తో శనివారం చెన్నైలో ఇంగ్లండ్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. దీంతో భారత్ 5 మ్యాచ్ ల T20I సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది.

Ind vs End: 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెన్నైలో భారత్-ఇంగ్లాండ్ జట్లు రెండో మ్యాచ్ లో తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యం ముందు ఓ వైపు వికెట్లు పడుతుండగా.. మరోవైపు ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తూ ఇంగ్లిష్ జట్టును ఒంటిచేత్తో ఓడించాడు.
తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ కు విజయాన్ని అందిచాడు. తిలక్ 55 బంతుల్లో 72 పరుగులు చేసి భారత్కు విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 130.91. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
వీరిద్దరు తప్ప మరే బ్యాట్స్మెన్ కూడా 20 పరుగులు చేయలేకపోయారు. చివర్లో 5 బంతుల్లో 9 పరుగులు చేసి రవి బిష్ణోయ్ తిలక్ వర్మకు మంచి సహకారం అందించాడు. తిలక్ వర్మ ఇంగ్లాండ్ బౌలర్ జామీ ఓవర్టన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
కుప్పకూలిన భారత టాపార్డర్
భారత టీ20 స్టార్ బ్యాట్స్మెన్లు సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (7) విఫలమయ్యారు. సంజూ శాంసన్ 5 పరుగులు, ధ్రువ్ జురెల్ 4, అక్షర్ పటేల్ 2 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అభిషేక్ శర్మ మెరవలేదు. అర్ష్దీప్ సింగ్ 6 పరుగులు చేశాడు.
దీనికి ముందు, జోస్ బట్లర్ పోరాట ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఇంగ్లాండ్ మిగిలిన బ్యాట్స్మెన్ అతనికి మద్దతు ఇవ్వలేకపోయారు. భారత స్పిన్నర్ల అద్భుత ప్రదర్శన కారణంగా శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో 9 వికెట్లకు 165 పరుగులకే పరిమితమైంది. బట్లర్ 30 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో అతను రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ను అవుట్ చేయడం ద్వారా అర్ష్దీప్ సింగ్ ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు.
నితీష్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడాడు
గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్-11లో ఎంపికయ్యాడు. రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో బెన్ డకెట్ ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇవ్వడంతో సుందర్ ప్రారంభంలోనే భారత్ కు శుభారంభం అందించాడు. గాయపడిన రింకూ సింగ్ స్థానంలో జురెల్ కూడా ఈ మ్యాచ్లో ఆడాడు. బ్యాడ్ పుల్ షాట్లు ఆడే ప్రయత్నంలో బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్ వికెట్లు కోల్పోయారు. వీరిద్దరినీ భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పెవిలియన్ పంపాడు.
బట్లర్ తిలక్ వర్మకు క్యాచ్ ఇవ్వగా, లివింగ్ స్టోన్ హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చాడు. గుస్ అట్కిన్సన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ బ్రైడన్ కార్సే 17 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్తో కలిసి పరుగులు తీయడంలో అవగాహన లోపంతో వికెట్ కోల్పోయాడు.
Tilak Varma
స్పిన్నర్లు విధ్వంసం సృష్టించారు
హ్యారీ బ్రూక్ దూకుడుగా ప్రారంభించి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సిక్సర్ కొట్టాడు, కానీ చక్రవర్తి వేసిన ఒక బంతికి అతను పూర్తిగా డాడ్జ్ అయ్యాడు. బంతి అతని ఆఫ్ స్టంప్కు తగలడంతో అతను తిరిగి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఇంగ్లండ్ను 150 పరుగులకు మించి తీసుకెళ్లినప్పటికీ వారు భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో సక్సెస్ కాలేకపోయారు. భారత్ తరఫున స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, ఫాస్ట్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ లు తలా ఒక్కో వికెట్ తీశారు.