INDvsENG: మూడు రోజుల్లో బయో బబుల్లోకి వచ్చేయండి... ఇరు జట్లకి బీసీసీఐ ఆదేశాలు...
ఆస్ట్రేలియా టూర్ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా... వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం రెఢీ అవుతోంది. ఐపీఎల్, ఆస్ట్రేలియా సిరీస్ కారణంగా ఇంటికి దూరంగా ఐదు నెలల పాటు గడిపిన క్రికెటర్లు... వారం కూడా రెస్టు తీసుకోకుండానే మళ్లీ బయో బబుల్ జోన్లోకి వెళ్లనున్నారు.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి రెండు టెస్టులు జరగనున్నాయి. ఇక్కడే ఇరు జట్లకు ప్రత్యేకంగా క్వారంటైన్ ఏర్పాట్లు చేయనుంది బీసీసీఐ...
శ్రీలంకతో ప్రస్తుతం రెండో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్... అది ముగిసిన వెంటనే 27న చెన్నైకి చేరుకుని క్వారంటైన్లోకి వెళ్తారు...
ఇరు జట్ల కోసం చెన్నైలోని ప్రఖ్యాత లీలా ప్యాలెస్ హోటల్లో బయో సెక్యూలర్ జోన్ను ఏర్పాటు చేసింది బీసీసీఐ... ఆటగాళ్లతో పాటు సిబ్బందికి కూడా ఇక్కడే వసతి ఏర్పాటు చేశారు.
ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంటికి వెళ్లి, కుటుంబంతో సమయం గడుపుతున్న భారత జట్టు ప్లేయర్లతో పాటు సహాయక సిబ్బంది కూడా మరో మూడు రోజుల్లో సెక్యూలర్ జోన్లోకి వచ్చేస్తారు...
శ్రీలంక టూర్లో భాగం కాని ఇంగ్లాండ్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్... నేరుగా ఇండియాకు రానున్నారు. ఇప్పటికే బెన్స్టోక్స్ ఇండియాకి బయలుదేరినట్టు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు...
ఆదివారం ఢిల్లీకి చేరుకున్న తర్వాత వీరికి ఢిల్లీలో కోవిద్ టెస్టు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వస్తే చెన్నైకి బయలుదేరతారు. లేదా అక్కడే ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది...
కరోనా పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చినప్పటికీ చెన్నైలో ఈ ముగ్గురికి ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. నేరుగా ఇంగ్లాండ్ నుంచి వస్తున్నందున వీరికి సెపరేట్గా క్వారంటైన్ ఏర్పాట్లు చేసింది బీసీసీఐ...
మొదటి రెండు టెస్టుల కోసం చిదంబరం స్టేడియంతో పాటు హోటెల్ సిబ్బంది, డ్రైవర్స్, గ్రౌండ్ మెన్... ఇలా దాదాపు 50 మంది క్వారంటైన్లో ఉండి, బయో బబుల్లో ఇరు జట్లకి సహాయం చేస్తారు... వీరికి తప్ప ఇతరులకు ఇక్కడికి అనుమతి ఉండదు...
మొదటి మొదటి రెండు టెస్టులకు 50 శాతం జనాలను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ ఆలోచన చేసినా... తర్వాత దాన్ని విరమించుకుంది....
ఫిబ్రవరి 5 నుంచి మొదలయ్యే మొదటి టెస్టుతో పాటు ఫిబ్రవరి 13న జరిగే రెండో టెస్టు కూడా స్టేడియం గేట్లు మూసి వేసి నిర్వహించారు. మ్యాచ్ వీక్షించేందుకు జనాలకు అనుమతి ఉండదు...
ఐపీఎల్ 2020 సీజన్లో ఏర్పాటు చేసినట్టుగానే స్టేడియంలో జనాలు ఉన్నట్టుగా అరుపులు, కేకలు వినిపించేలా ఆర్టిఫిషియల్ సౌండ్స్ ఏర్పాటు చేయనుంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్..