T20 World Cup 2026: టీమిండియా బౌలర్లకు ఏమైంది? ఫైనల్ ముందు సూర్యకుమార్ టెన్షన్ !
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు భారత్ చేరినప్పటికీ, బౌలింగ్ విభాగంలో లోపాలు కనిపిస్తున్నాయి. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?

భారత్ ఫైనల్కు చేరినా బౌలింగ్లో వణుకు.. ఆ 3 తప్పులే ప్రధాన కారణమా?
టీ20 ప్రపంచకప్ 2026లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఇప్పటికే ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనున్న తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో వరుసగా నాలుగు విజయాలతో భారత్ జోరు కనబరిచింది. అయితే, సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్లపై అద్భుత విజయాలు సాధించి సెమీఫైనల్కు చేరుకుంది.
సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై భారత బ్యాటర్లు కలిసికట్టుగా రాణించి 253 పరుగుల భారీ స్కోరు సాధించారు. అయితే, ఈ హై-స్కోరింగ్ మ్యాచ్లో భారత్ కేవలం 7 పరుగుల స్వల్ప తేడాతోనే విజయం సాధించింది. బ్యాటర్లు తమ పనిని సమర్థంగా నిర్వహించినప్పటికీ, బౌలర్లు మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తడబడ్డారు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి బలమైన బౌలింగ్ యూనిట్ ఉన్నప్పటికీ, వారు అంచనాలను అందుకోలేకపోతున్నారు. భారత బౌలర్లు విఫలం కావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా..
భారీ స్కోర్లను కాపాడుకోవడంలో వైఫల్యం
భారత జట్టు ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్లు సాధిస్తోంది. కానీ, రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు ఆ పరుగులను కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఉదాహరణకు, జింబాబ్వేపై భారత్ 256 పరుగులు చేసినా, బౌలర్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయారు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో కూడా 253 పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటర్లు 246 పరుగులు చేసే వరకు బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో కురుస్తున్న మంచు ప్రభావం బౌలర్లకు శాపంగా మారింది.
డెత్ ఓవర్లలో పరుగుల వరద
చివరి ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఇబ్బంది పడుతున్నారు. మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కకపోవడం వల్ల డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. జింబాబ్వే, ఇంగ్లాండ్ జట్లు ఛేజింగ్లో ఓడిపోయినప్పటికీ, చివరి ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లలో కూడా డెత్ ఓవర్ల బౌలింగ్ భారత్ను ఆందోళనకు గురిచేసింది.
మిడిల్ ఓవర్లలో నియంత్రణ లేకపోవడం
పవర్ ప్లేలో వికెట్లు తీస్తున్నప్పటికీ, మిడిల్ ఓవర్లలో పరుగుల వేగాన్ని తగ్గించడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కానీ మిడిల్ ఓవర్లలో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో ప్రోటీస్ జట్టు 180 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. సెమీఫైనల్లో కూడా ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత మిడిల్ ఓవర్లలో పుంజుకుంది. ఇది భారత్ విజయంపై తీవ్ర ప్రభావం చూపింది.
వరుణ్ చక్రవర్తి, బుమ్రా రాణిస్తున్నా..
ఈ టోర్నీలో భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా కొనసాగుతున్నారు. వరుణ్ తన మిస్టరీ స్పిన్తో వికెట్లు తీస్తున్నప్పటికీ, ఇతర బౌలర్ల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే, బౌలింగ్ విభాగం తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, వికెట్లు తీస్తున్నప్పటికీ వరుణ్ భారీగా పరుగులు సర్పించుకోవడం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఉంది.
భారత్ ఫైనల్ గెలవాలంటే ఏం చేయాలి?
మార్చి 8న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే బౌలింగ్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం. భారీ స్కోర్లు సాధించినా బౌలర్లు విఫలమైతే కప్ గెలవడం కష్టమవుతుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో టీమ్ ఇండియా బౌలర్లు దృష్టి సారించాలి. సూర్యకుమార్ యాదవ్ తన బౌలర్లను ఎలా ఉపయోగిస్తాడనే దానిపైనే భారత్ ప్రపంచకప్ కల ఆధారపడి ఉంది.
