నో టికెట్స్... రెండో టెస్టు టికెట్ల కోసం ప్రేక్షకుల భారీ క్యూ... అండర్సన్ దూరం, బరిలో స్టువర్ట్ బ్రాడ్...
ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో మొదటి టెస్టు ఆడిన భారత జట్టు, రెండో టెస్టులో 50 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టుకి మొత్తం కెపాసిటీలో 50 శాతం అంటే 15 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. రెండు రోజుల నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ విక్రయిస్తున్న ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
మొదటి టెస్టులో ఒకే ఓవర్లో శుబ్మన్ గిల్, అజింకా రహానేలను అవుట్ చేసి భారత జట్టుకి ఊహించిన షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్... రెండో టెస్టులో బరిలో దిగడం లేదు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసిన అండర్సన్, రెండో ఇన్నింగ్స్లో 11 ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు.
హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న యంగ్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్తో పాటు అజింకా రహానేను ఒకే ఓవర్లో అవుట్ చేసిన అండర్సన్, ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ను కూడా పెవిలియన్ చేర్చాడు. అండర్సన్కి రెండో టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు...
38 ఏళ్ల అండర్సన్, ఇప్పటికే 158 టెస్టులు పూర్తిచేసుకున్నాడు. జేమ్స్ అండర్సన్ స్థానంలో మరో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి రానున్నాడు. 34 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే 144 టెస్టులు ఆడినబ్రాడ్, 517 వికెట్లు పడగొట్టాడు...
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా అండర్సన్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అండర్సన్ కోసం స్టువర్ట్ బ్రాడ్ను పక్కనబెట్టిన ఇంగ్లీష్ టీమ్, ఇప్పుడు బ్రాడ్ కోసం అండర్సన్కి విశ్రాంతి ఇవ్వనుంది.
‘బ్యాట్స్మెన్లాగే బౌలర్లకు కూడా ఫామ్ చాలా అవసరం. రిథమ్ అందుకుంటే, ఎలాంటి బౌలర్ అయినా వికెట్లు పడగొట్టగలడు. వరుసగా నాలుగు టెస్టులు ఆడితే ఒత్తిడి పెరుగుతుందని నాకుతెలుసు. కానీ విశ్రాంతి తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు జేమ్స్ అండర్సన్.
‘జేమ్స్ అండర్సన్ లాంటి టాప్ బౌలర్ను పక్కనబెట్టడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. విన్నింగ్ టీమ్నే కొనసాగించాలని అంతా భావిస్తారు. కానీ ఆటగాళ్ల ఎంపిక విషయంలో రొటేషన్ పద్ధతి పాటించాలని అనుకుంటున్నాం. అందుకే అండర్సన్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వస్తాడు. స్టువర్ట్ బ్రాడ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్.
చెన్నై చెపాక్లోని ఏంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు క్యూ...
చెన్నై చెపాక్లోని ఏంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ టికెట్లతో ప్రేక్షకులు...