6,6,6,6,6,6.. భారత్కు కొత్త 'హిట్మ్యాన్' దొరికాడు.. కోల్కతాలో బ్యాటింగ్ సునామీ
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ సునామీ కొనసాగింది. దీంతో 13 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ను చిత్తుచేసి భారత్ విజయాన్ని అందుకుంది.

India vs England: భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది 'హిట్మ్యాన్' అనే మరోపేరు. దానికి తగ్గట్టుగానే ధనాధన్ ఇన్నింగ్స్ లతో భారీ హిట్టింగ్ షాట్స్ తో సూపర్ ఇన్నింగ్స్ లు ఆడతాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీమిండియా కొత్త హిట్ మ్యాన్ దొరికాడా?
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. అయితే, ఇప్పుడు భారత జట్టుకు కొత్త 'హిట్మ్యాన్' దొరికాడు. కేవలం 24 ఏళ్ల ఈ ఆటగాడు ఇంగ్లండ్ జట్టులోనూ భీభత్సం సృష్టించాడు.
ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోల్కతా వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో ఈ యంగ్ బ్యాట్స్మెన్ బ్యాట్తో బీభత్సం సృష్టించాడు. అతనే ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించిన అభిషేక్ శర్మ.
Abhishek Sharma-Sanju Samson
అభిషేక్ శర్మ విశ్వరూపం
అభిషేక్ శర్మ జూలై 2024లో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. అరంగేట్రం సిరీస్లో రెండో మ్యాచ్లో అభిషేక్ సెంచరీ సాధించాడు. అయితే, దీని తర్వాత అతని ప్రదర్శన హెచ్చు తగ్గులతో నిండిపోయింది.
అయితే తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో తన ఫామ్ను కొనసాగిస్తూ దుమ్మురేపాడు. ఇంగ్లండ్పై ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్గా అభిషేక్ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఊతికిపారేసిన అభిషేక్ శర్మ
కోల్ కతాలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులు మాత్రమే చేసింది. ఈ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. సంజు శాంసన్ రెండవ ఓవర్లో 22 పరుగులు చేయడంతో మంచి ఆరంభం లభించింది.
కానీ, అతను స్కోరు 26 వద్ద అవుట్ అయ్యాడు, ఆ తర్వాతి బంతికి సూర్య కూడా తన వికెట్ కోల్పోయాడు. దీని తర్వాత 24 ఏళ్ల అభిషేక్ బాధ్యతలు స్వీకరించి ఇన్నింగ్స్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి 34 బంతుల్లో 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టాడు.
ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్
ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఇరు జట్లు జనవరి 25న రెండో టీ20లో తలపడనున్నాయి.