- Home
- Sports
- Cricket
- ఇక్కడ ఎలాగో గెలిచేశాం! ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాని ఓడించడం టీమిండియా వల్ల అయ్యే పనేనా...
ఇక్కడ ఎలాగో గెలిచేశాం! ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాని ఓడించడం టీమిండియా వల్ల అయ్యే పనేనా...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగోసారి సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా సరికొత్త చరిత్ర లిఖించింది. స్వదేశంలో టెస్టు నెంబర్ 1 టీమ్ని తొలి రెండు టెస్టుల్లో ముప్పు తిప్పలు పెట్టింది. 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించింది టీమిండియా...

ఇండోర్ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా ఫైనల్ ఛాన్సులు దెబ్బతిన్నాయి. అయితే తొలి టెస్టులో శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్, అక్కడ పరువు నిలబెట్టుకోవడమే కాదు, ఇండియాని ఫైనల్కి చేర్చింది. లేదంటే నాలుగో టెస్టు డ్రా అయిన తర్వాత టీమిండియా ఫైనల్ ఛాన్సులు, లంకపైనే ఆధారపడి ఉండేవి...
ఎలాగోలా టెస్టు సిరీస్ని సొంతం చేసుకున్న భారత జట్టు, జూన్ 7 నుంచి లండన్లోని ది ఓవల్లో ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. గత సీజన్లో న్యూజిలాండ్ చేతుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఓడింది టీమిండియా...
అయితే అప్పటికీ ఇప్పటికీ టీమ్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించగా, ఈసారి రోహిత్ శర్మ, కెప్టెన్గా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్గా తన మొట్టమొదటి ఫారిన్ టెస్టు ఆడబోతున్నాడు... ఇండియాలో మొదటి నాలుగు టెస్టులు గెలిచిన రోహిత్కి అసలు సిసలైన మెగా ఛాలెంజ్ ఇది...
ఇండియాలోని స్పిన్ పిచ్లపై ఆసీస్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా. అయితే ఇంగ్లాండ్లో పిచ్, పరిస్థితులు ఇలా ఉండవు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో నాలుగు టెస్టుల్లోనూ అశ్విన్ రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది...
ఇంగ్లాండ్లో టెస్టు మ్యాచ్ గెలవాలంటే ఫాస్ట్ బౌలర్లే ప్రధానం. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్తో పాటు ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్... టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కీలకంగా మారబోతున్నారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ల్లో ఒకరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కవచ్చు...
Image credit: PTI
విదేశాల్లో జరిగిన టెస్టు సిరీసుల్లో జస్ప్రిత్ బుమ్రా టీమిండియా ప్రధాన అస్త్రం. అలాగే బ్యాటింగ్లో రిషబ్ పంత్ కీలక బ్యాటర్. ఈ ఇద్దరూ గాయపడి, టీమ్కి దూరంగా ఉన్నారు. జూన్లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడడం లేదు... శ్రేయాస్ అయ్యర్ కూడా ఫైనల్ మ్యాచ్ సమయానికి ఫిట్గా ఉంటాడా? లేదా? చెప్పడం కష్టం...
విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, రవీంద్ర జడేజా.. రూపంలో టీమిండియాకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ, 2021 ఇంగ్లాండ్ టూర్లో మొట్టమొదటి విదేశీ టెస్టు సెంచరీ సాధించాడు. అయితే నాలుగు టెస్టులు ఆడిన అనుభవం ఉన్న శ్రీకర్ భరత్పై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం కష్టమే..
KL Rahul
శ్రీకర్ భరత్ ప్లేస్లో కెఎల్ రాహుల్ని వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకురావడం మంచి ఎత్తుగడే. అయితే రాహుల్, అన్ని ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయగలడా? అనేది చాలా పెద్ద ఛాలెంజ్. రాహుల్కి ఇంగ్లాండ్లో మంచి రికార్డు ఉంది. అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తే టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా మారుతుంది...
Brisbane Test
తిరుగులేని బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాని పెద్దగా అనుభవం లేని టీమిండియా ఓడించింది. అయితే అక్కడ మ్యాజిక్ చేసిన రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్ ఇప్పుడు టీమ్లో లేరు. అజింకా రహానే, మయాంక్ అగర్వాల్ టీమ్కి దూరమయ్యారు.
ఈసారి కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవాలంటే టీమిండియా.. 100కి 200 శాతం కష్టపడాల్సిందే.. భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మ, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. దీంతో రోహిత్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాలెంజ్ని పర్సనల్గా తీసుకుంటే... రిజల్ట్ ఇండియాకి ఫేవర్గా రావచ్చు...