హాట్ కేకుల్లా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ల టిక్కెట్లు... రెండు రోజుల్లోనే ఆరు మ్యాచులకు...
కరోనా బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్తో మళ్లీ అసలు సిసలైన క్రికెట్ సందడి మొదలుకానుంది. యూఏఈలో ఖాళీ స్టేడియాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ 13 ఆడిన క్రికెటర్లు, ఆసీస్ టూర్లో జనాలతో నిండిన స్టేడియాల్లో మ్యాచ్ ఆడబోతున్నారు. నవంబర్ 27 నుంచి మొదలైన ఈ టూర్కి సంబంధించిన మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్లో మొదటి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడబోతోంది టీమిండియా...
మొదటి రెండు వన్డే మ్యాచులకి సిడ్నీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత మూడో వన్డే, మొదటి టీ20 మ్యాచ్ కాన్బెర్రాలో జరుగుతాయి...
రెండో టీ20తో పాటు ఆఖరి టీ2 మ్యాచ్ కూడా సిడ్నీ క్రికెట్ స్టేడియంలోనే జరగనుంది. సిడ్నీ, కాన్బెర్రాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాంతో కరోనా నిబంధనలకు లోబడి మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా.
సిడ్నీ, కాన్బెర్రా స్టేడియాల్లో 50 శాతం టిక్కెట్లు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లో ఆరు మ్యాచులకు సంబంధించిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోయినట్టు సమాచారం..
అయితే తొలి టెస్టు జరగనున్న ఆడిలైడ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆడిలైడ్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారా? అనేది అనుమానంగా మారింది...
కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆడిలైడ్లో పూర్తి లాక్డౌన్ విధించారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నట్టు వచ్చిన సమాచారం సరైనది కాదని, అది కేవలం పుకారు మాత్రమేనని తేల్చిన అధికారులు, లాక్డౌన్ను త్వరలోనే ఎత్తివేస్తామని ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం జనాల మధ్య తొలి టెస్టు జరుగుతుందని స్పష్టం చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా...
27 వేల మంది కెపాసిటీ ఉన్న ఆడిలైడ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. భారత సారథి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తర్వాత స్వదేశం తిరిగి రానున్నాడు.
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ లాంటి బౌలర్లకు టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చిన టీమిండియా, టెస్టు సిరీస్ సమయానికి అందుబాటులో ఉండేలా సంసిద్ధం చేస్తోంది.