ఇండియా-ఇంగ్లాండ్ టీ20 సిరీస్: మ్యాచ్లు ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
India vs England: ఇండియా-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ జనవరి 22 నుంచి మొదలవుతుంది. మ్యాచ్లు ఎప్పుడు మొదలవుతాయి? ఏ టీవీలో చూడొచ్చు? ఇంకా ఇతర వివరాలు మీకోసం.

ఇటీవల భారత జట్టు ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ల సిరీస్ ఆడింది. ఇందులో ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి, 3 మ్యాచ్లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. జట్టు ఓటమికి కారణమైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్లపై విమర్శలు వచ్చాయి.
వచ్చే నెలలో 'మిని వరల్డ్ కప్' అని పిలువబడే ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. దానికి ముందు ఇండియా జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 జనవరి 22 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్
భారత జట్టు 22 జనవరి 2025న కోల్కతాలో ఇంగ్లాండ్తో తన మొదటి T20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఇంగ్లండ్ భారత పర్యటన ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ సిరీస్ లో రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలో, మూడో టీ20 మ్యాచ్ జనవరి 28న రాజ్ కోట్ లో, నాలుగో టీ20 మ్యాచ్ జనవరి 31న పుణెలో జరుగుతుంది.
ఇక ఈ సిరీస్ లో చివరి, ఐదో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతాయి. అయితే టీ20 సిరీస్ కు భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండరు. ఇప్పటికే వీరు పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నారు.
ఇండియా-ఇంగ్లాండ్ టీ20లు ఏ టీవీలో చూడాలి?
ఇండియా-ఇంగ్లాండ్ టీ20లు రాత్రి 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీతో కూడా మ్యాచ్ లను చూడవచ్చు. అలాగే, డిస్నీ+ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
భారత టీ20 జట్టు కెప్టెన్ ఎవరు?
ఈ సిరీస్లకు ఇండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, సంజు శాంసన్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు.
ఇండియా టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ద్రువ్ జురేల్.
ఇంగ్లాండ్ జట్టుకు టీ20, వన్డేలకు జోస్ బట్లర్ కెప్టెన్.
ఇంగ్లాండ్ టీ20, వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహ్మూద్.
భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్
టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో భారత క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ను కూడా ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ఫిబ్రవరి 6న నాగ్పూర్లో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న కటక్లో, ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్లో జరగనుంది.
దీని తర్వాత భారత జట్టు ఫిబ్రవరి 14 లేదా 15న దుబాయ్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో భారత జట్టు తన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుంది. అలాగే, భారత జట్టు ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్తో ఆడుతుంది.