SA Vs Ind: శిఖర్ ధావన్ కు భారీ షాక్.. తొలి వన్డేలో రాహుల్ తో ఓపెనర్ గా రానున్న వెంకటేశ్ అయ్యర్..?
South Africa Vs India 1st ODI: సఫారీల పర్యటనలో ఉన్న భారత జట్టు నేటి మధ్యాహ్నంతో మొదలయ్యే తొలి వన్డేతో సిరీస్ వేటను ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో రాకరాక జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ కు...
దక్షిణాఫ్రికాతో వన్డే పోరుకు టీమిండియా సిద్ధమవుతున్నది. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి పార్ల్ వేదికగా తొలి వన్డే ఆడనున్నది. గత పర్యటనలో మాదిరిగానే ఈసారి కూడా వన్డే సిరీస్ నెగ్గాలని భావిస్తున్నది. 2018 పర్యటనలో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు 4-1 తేడాతో సఫారీలను మట్టికరిపించిన విషయం తెలిసిందే.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో విరాట్ కోహ్లిని పక్కకుపెట్టడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. రోహిత్ శర్మకు పగ్గాలు అప్పజెప్పింది. అయతే ఈ సిరీస్ కు ముందు గాయంతో అతడు దూరం కావడంతో కెఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.
మంగళవారం పాత్రికేయులతో మాట్లాడిన రాహుల్.. తాను ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు తుది జట్టు కూర్పుపై విశ్లేషణలు చేస్తున్నారు. ఓపెనింగ్ జోడీ ఎవరనేదానిమీదే ప్రధానంగా వారి విశ్లేషణ సాగింది.
చాలా కాలం తర్వాత భారత జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ ను కాకుండా కొత్త కుర్రాడు వెంకటేశ్ అయ్యర్ ను ఓపెనర్ గా పంపితే బెటరని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
ఒక స్పోర్ట్స్ ఛానెల్ తో మంజ్రేకర్ మాట్లాడుతూ..‘శిఖర్ ధావన్ కు ఈ మ్యాచులో విశ్రాంతినివ్వాలి. వెంకటేశ్ అయ్యర్ తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయాలి..’ అన్నాడు. ఇదిలాఉండగా మరో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం.. రాహుల్ కు జోడిగా శిఖర్ ధావన్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
Venkatesh Iyer
అంతేగాక.. ‘కోహ్లి, అయ్యార్, సూర్యకుమార్ యాదవ్ లతో కూడిన టీమిండియా మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. జయంత్ యాదవ్ ను కూడా తుది జట్టులోకి తీసుకుంటే అతడు ఏడో స్థానంలో బ్యాటింగ్ కు రావాలి. అశ్విన్ ను కూడా ఆడించాలి..’ అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు మంజ్రేకర్ ఎంచుకున్న జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జయంత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్